
IND vs NZ 1st T20I : టీమిండియా నయా గర్జన..తొలి టీ20లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్
IND vs NZ 1st T20I : టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరుగుతున్న అత్యంత కీలకమైన సిరీస్లో భారత్ అద్భుతమైన బోణీ కొట్టింది.
IND vs NZ 1st T20I : టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరుగుతున్న అత్యంత కీలకమైన సిరీస్లో భారత్ అద్భుతమైన బోణీ కొట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి పోరులో కివీస్పై 48 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు (5 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది జట్టుకు రాకెట్ వేగంతో కూడిన ఆరంభాన్ని ఇచ్చాడు. యువరాజ్ సింగ్ రికార్డులను సైతం కదిలిస్తూ సాగిన అతడి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.
మధ్యలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (25) విలువైన పరుగులు చేయగా, చివర్లో ఫినిషర్ రింకూ సింగ్ తన మార్క్ చూపించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, కైల్ జెమీసన్ రెండేసి వికెట్లు పడగొట్టినా, పరుగులను మాత్రం నియంత్రించలేకపోయారు. ఇరు జట్లు కలిపి ఈ మ్యాచ్లో ఏకంగా 428 పరుగులు చేయడం ఒక విశేషం. ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్లో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి.
239 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ తీయగా, రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడగొట్టి కివీస్ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేశాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసినా.. అతడికి సరైన సహకారం అందలేదు. మార్క్ చాప్మన్ (39) కాసేపు పోరాడినా భారత్ బౌలర్ల ధాటికి కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో రెండు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. అర్ష్దీప్, హార్దిక్కు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో శుభారంభం చేయడమే కాకుండా, వరల్డ్ కప్ రేసులో ఉన్న ఆటగాళ్ల ఫామ్ను కూడా నిర్ధారించుకుంది. యువ బ్యాటర్లు అటాకింగ్ గేమ్ను కొనసాగించడం, బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడం టీమిండియా మేనేజ్మెంట్కు కొండంత బలాన్ని ఇచ్చింది. సిరీస్లో రెండో మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




