IND vs NZ 1st ODI: వడోదరలో విరాట్ పర్వం..15 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ-ఎంట్రీ..కివీస్‌పై భారత్ ఘనవిజయం

IND vs NZ 1st ODI: టీమిండియా కొత్త ఏడాదిని ఘనమైన విజయంతో ప్రారంభించింది.

CR Reddy
Published on: 12 Jan 2026 10:54 AM IST
IND vs NZ 1st ODI: వడోదరలో విరాట్ పర్వం..15 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ-ఎంట్రీ..కివీస్‌పై భారత్ ఘనవిజయం
X

IND vs NZ 1st ODI: వడోదరలో విరాట్ పర్వం..15 ఏళ్ల తర్వాత అదిరిపోయే రీ-ఎంట్రీ..కివీస్‌పై భారత్ ఘనవిజయం

IND vs NZ 1st ODI: టీమిండియా కొత్త ఏడాదిని ఘనమైన విజయంతో ప్రారంభించింది. వడోదరలోని నూతనంగా నిర్మించిన కోటాంబి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వడోదర గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే సరికొత్త చరిత్ర సృష్టించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కింగ్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించగా, చివర్లో కె.ఎల్. రాహుల్ తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియాను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే, యంగ్ పేసర్ హర్షిత్ రాణా ఈ జోడీని విడదీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత డారిల్ మిచెల్ (84) ఒంటరి పోరాటం చేసి కివీస్ స్కోరును 300 దాటించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ (26) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా ఎక్కువ సేపు నిలవలేదు. కానీ, క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మైదానం నలుమూలలా ఫోర్లు బాదుతూ వడోదర ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్ధలు కొట్టాడు. కోహ్లీ (93), శుభ్‌మన్ గిల్ (56) కలిసి రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. శ్రేయాస్ అయ్యర్ (49) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

సెంచరీ దిశగా సాగుతున్న కోహ్లీ 93 పరుగుల వద్ద కైల్ జేమీసన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. వెంటవెంటనే వికెట్లు పడటంతో భారత్ కాస్త ఇబ్బంది పడింది. ఆ సమయంలో కె.ఎల్. రాహుల్ (29 నాటౌట్) తన అనుభవాన్నంతా రంగరించి మ్యాచ్‌ను క్లైమాక్స్ వరకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్లలో హర్షిత్ రాణా (29) కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించడంతో భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 49వ ఓవర్లో రాహుల్ బాదిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 93 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

CR Reddy

CR Reddy

Next Story