Ishan Kishan: ఈ జార్ఖండ్‌ కుర్రాడికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రెక్ట్ ఎలా దక్కింది?

Ishan Kishan: రిషభ్ పంత్ కు గ్రేడ్ B నుండి A కు ప్రమోషన్ లభించగా, అశ్విన్ క్రికెట్ నుంచి రిటైర్ అవడంతో ఆయన పేరును తీసేశారు.

veeru
Updated on: 15 May 2025 3:19 AM IST
Ishan Kishan
X

Ishan Kishan: ఈ జార్ఖండ్‌ కుర్రాడికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రెక్ట్ ఎలా దక్కింది?

Ishan Kishan

బీసీసీఐ 2024-25 సీజన్‌కు సెంట్రల్‌ కాంట్రాక్టులు ప్రకటించిన తర్వాత క్రికెట్ వర్గాల్లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. మొత్తం 34 మంది ఆటగాళ్లకు కొత్త ఏడాది కోసం రెటైనర్‌షిప్ కాంట్రాక్టులు లభించాయి. ఇందులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ ఒప్పందం రావడం కొంత ఆశ్చర్యానికి దారితీసింది. శ్రేయస్ ఐయర్ మళ్లీ జట్టులోకి వచ్చేటప్పుడే అనేకులు ఊహించిన విషయం. కానీ గత ఏడాది భారత జట్టులో ఆడకపోయినా ఇషాన్ కిషన్‌కు ఎలా కాంట్రాక్టు వచ్చిందన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. అతను చివరిసారిగా నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఆడాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కు బ్యాక్‌అప్ వికెట్ కీపర్‌గా వెళ్లినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మధ్యలోనే మెంటల్ రెస్ట్ అవసరమని చెప్పి ఇండియా తిరిగివచ్చాడు.

ఇదే సమయంలో బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో తప్పనిసరిగా పాల్గొనాలి అనే నిబంధనను కఠినంగా అమలు చేసింది. దీనిని ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రవర్తించినందుకే గత ఏడాది ఇషాన్‌తో పాటు శ్రేయస్ కూడా కాంట్రాక్టు కోల్పోయారు. కానీ 2024-25 సీజన్‌లో వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల తరఫున, ముంబయి, ఝార్ఖండ్ తరఫున రాణించారు. ఇషాన్ తిరిగి జాతీయ జట్టుకు చేరడమేమీ ఇప్పట్లో కనిపించకపోయినా, అతను గతంలో మూడు ఫార్మాట్లలోనూ దేశాన్ని ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో బోర్డు అతనిపై నమ్మకాన్ని చూపిందని చెప్పొచ్చు. భారత్ A జట్టు తరఫున ఆస్ట్రేలియా టూర్‌లో రెండు ఫోర్ డే మ్యాచ్‌లు ఆడటం కూడా అతను బోర్డు ప్రణాళికల్లో ఉన్నాడని సూచించింది.

ఇదిలా ఉంటే, ఇషాన్ భవిష్యత్తు చాలా వరకు ఐపీఎల్ 2025లో అతని ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఇతడు మళ్లీ జాతీయ జట్టుకు రావాలంటే స్పష్టమైన పెర్ఫార్మెన్స్ అవసరం. ఇతర కేటగిరీల్లో చూస్తే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు A+ గ్రేడ్‌లో కొనసాగారు. వీరిలో కొంతమంది టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినా, అన్ని ఫార్మాట్లలో విశేష ప్రభావం చూపినందుకే ఈ గ్రేడ్‌లో కొనసాగించారు.

రిషభ్ పంత్ కు గ్రేడ్ B నుండి A కు ప్రమోషన్ లభించగా, అశ్విన్ క్రికెట్ నుంచి రిటైర్ అవడంతో ఆయన పేరును తీసేశారు. జితేష్ శర్మ, అవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ లాంటి ఆటగాళ్లు ఈసారి కాంట్రాక్టుల నుంచి బయటకు వెళ్లారు. అందులోనూ రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లకు వచ్చే ఇంగ్లండ్ టూర్ కీలకం కానుంది. ఆ టెస్ట్ సిరీస్‌లో వారి ప్రదర్శనపైనే వచ్చే ఏడాది వారి కాంట్రాక్టు స్థాయి ఆధారపడే అవకాశం ఉంది.

veeru

veeru

Next Story