Football: నేటి నుంచి ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌

* తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్‌ 'ఢీ'... డిసెంబర్ 18న ఫైనల్ మ్యాచ్

R Tripura Malini
Published on: 20 Nov 2022 8:15 AM IST
Football world cup from today
X

నేటి నుంచి ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌

Football World Cup: ఖతర్‌ దేశపు రాజధాని దోహా వేదికగా 22వ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్‌ తలపడుతుంది. ఖతర్‌ జాతీయ దినోత్సవం డిసెంబర్‌ 18న ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్‌–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో 'ఫిఫా' ప్రపంచ కప్‌ జరగడం ఇది రెండోసారి కాగా ఒక మధ్యప్రాచ్య దేశం విశ్వ సంరంభానికి వేదిక కావడం ఇదే మొదటిసారి. 32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్‌ కప్‌ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్‌ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయి.

నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతీ ప్రపంచకప్‌ సాధారణంగా జూన్‌–జూలైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ఎడారి దేశంలో నిర్వహణ సాధ్యం కాదని 'ఫిఫా' మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని, 8 వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ఇన్‌ఫినిటీని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story