IND vs AUS: ఎంతపనాయె.. హాట్‌ టాపిక్‌గా కేఎల్ రాహుల్ ఔట్..!

KL Rahul Out: ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 ఆరంభం అయింది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2024 11:56 AM IST
AUS vs IND 1st Test Indian Fans Trolls Third Umpire Over KL Rahul Out
X

IND vs AUS: ఎంతపనాయె.. హాట్‌ టాపిక్‌గా కేఎల్ రాహుల్ ఔట్..!

KL Rahul Out: ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 ఆరంభం అయింది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు భారీ షాక్‌లు తగిలాయి. ఆసీస్ బౌలర్ల ముందు భారత్ టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. కేఎల్ రాహుల్ (26; 74 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే క్రీజులో నిలబడ్డాడు. కాస్త కుదురుగా ఆడిన రాహుల్.. అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం సరైంది కాదని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్ దెబ్బకు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0) డకౌట్‌ అయ్యారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ సమయంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ ఒక్కడే పోరాడాడు. 74 బంతులు ఎదుర్కొని ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అయితే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. భారత్ ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌లో రెండో బంతిని స్టార్ఖ్ వేయగా.. ఆఫ్‌సైడ్‌ వచ్చిన బంతిని రాహుల్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి వెళ్లి కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. ఆసీస్‌ ఆటగాళ్లు క్యాచ్‌ ఔట్ కోసం అప్పీలు చేయగా.. ఫీల్డ్‌ అంపైర్ ఔట్‌ ఇవ్వలేదు.

వెంటనే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టత లేదు. సరిగ్గా ఆ సమయంలో రాహుల్ ప్యాడ్‌ను బ్యాట్‌ తాకడంతో.. స్పైక్స్‌ వచ్చాయి. ఓ కోణంలో చూస్తే.. బ్యాట్‌కు బంతి తగల్లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. అయినా కూడా థర్డ్‌ అంపైర్ రాహుల్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోని.. అవుట్ ఇచ్చాడు. బ్యాట్‌కు బంతి తగల్లేదని చూపిస్తూ రాహుల్ అసహనం వ్యక్తం చేస్తూ డగౌట్ చేరుకున్నాడు. ఈ అవుట్ ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది.

కేఎల్ రాహల్ అనంతరం ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం రిషబ్ పంత్, నితీష్ రెడ్డిలు క్రీజులో ఉన్నారు. భారత్ 6 వికెట్లను 97 రన్స్ చేసింది. రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించకుంటే భారత్ ఇన్ని వికెట్స్ కోల్పోయేది కాదని ఫాన్స్ అంటున్నారు. థర్డ్‌ అంపైర్‌ ఆస్ట్రేలియాకు సపోర్ట్ చేస్తున్నాడని, సమీక్షలో లోపాలు ఉన్నాయని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకనుంచైనా సరైన ఫలితం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story