జట్టు ఎంపికలో ఘోర తప్పిదం జరిగిందా.. ఆ విషయంలో కోహ్లీ సేనకు షాక్ తగలనుందా?

IND vs SA: డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

Shireesha
Updated on: 24 Dec 2021 1:38 PM IST
Anil Kumble most successful leg spinner vs South Africa, kohli Didnt Take Leg Spinner Kuldeep Yadav
X

జట్టు ఎంపికలో ఘోర తప్పిదం జరిగిందా.. ఆ విషయంలో కోహ్లీ సేనకు షాక్ తగలనుందా?

IND vs SA: డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఆఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి విరాట్ కోహ్లీ సేనపై ఆశలు చిగురించాయి. అయితే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టు చేసిన ఘోర తప్పిదం ఒకటి తెరపైకి వచ్చింది.

దక్షిణాఫ్రికాలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే నిలిచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, కోహ్లి జట్టులో ఒక్క లెగ్ స్పిన్నర్ కూడా ఎంపిక కాకపోవడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే టీమిండియాకు యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్ వంటి ప్రపంచ స్థాయి లెగ్ స్పిన్నర్లు ఉన్నా.. వీరిని సౌతాఫ్రికా పర్యటనకు ఎంచుకోలేదు.

కుంబ్లే 1999 నుంచి 2007 వరకు దక్షిణాఫ్రికాలో 12 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 45 వికెట్లు పడగొట్టాడు. 53 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాలో తన అత్యుత్తమ రికార్డును నెలకొల్పాడు. ఆఫ్రికా గడ్డపై భారత బౌలర్లలో కుంబ్లే తర్వాత ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ 43 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు.

యుజ్వేంద్ర చాహల్ టెస్టులు, వన్డేలతోపాటు టీ20ల్లో గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియా తరపున అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 56 వన్డేలు ఆడిన చాహల్ 26.93 సగటుతో 97 వికెట్లు పడగొట్టాడు.

ఇక టీ20ల విషయానికి వస్తే చాహల్, 50 మ్యాచుల్లో 64 వికెట్లు తీశాడు. ఇలాంటి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, చాహల్‌ ఇప్పటి వరకు భారత్ తరపున టెస్టు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. 2016 నుంచి టీమ్ ఇండియాలో భాగమైన ఈ ఆటగాడికి ఎంతో అనుభవం కూడా ఉంది. దక్షిణాఫ్రికా టూర్‌లో ఈ ఆటగాడికి అవకాశం దక్కాల్సి ఉంది.

2018లో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టును ఎవరూ మర్చిపోలేరు. ఈ టెస్టులో కుల్దీప్ 99 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అప్పట్లో టీం ఇండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కూడా ఈ చైనామన్ బౌలర్‌పై ప్రశంసల జల్లులు కురిపించాడు. విదేశాల్లో భారత్‌కు అత్యంత తెలివైన స్పిన్నర్‌గా అభివర్ణించాడు. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో కుల్‌దీప్‌ జట్టులో స్థానం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ రీఎంట్రీ కోసం తహతహలాడుతున్నాడు.

ఇక మరో స్పిన్ బౌలర్ రాహుల్ చాహర్‌ విషయానికి వస్తే.. టీ20 ప్రపంచ కప్ జట్టులో చేర్చారు. కానీ, టోర్నమెంట్‌లో అతని పేలవ ప్రదర్శన కారణంగా జట్టు నుంచి తొలగించారు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో చాహల్, కుల్దీప్ వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి 33 వికెట్లు పడగొట్టారు. కానీ, 2021 టూర్‌లో మాత్రం వీరికి ఛాన్స్ దక్కలేదు.

డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇద్దరు స్పిన్ బౌలర్లు ఆర్. అశ్విన్, జయంత్ యాదవ్‌లను ఎంపిక చేసింది. అయితే ఇంగ్లండ్ పర్యటనలో ఆర్. అశ్విన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఎంపిక చేయకపోవడంతో చాలా విమర్శలు వచ్చాయి. మరి ఈసారి ఏంచేయనున్నారో చూడాలి.

Shireesha

Shireesha

Next Story