2011 World Cup: ధోనీ ఫినిషింగ్‌ సిక్సర్‌కు పదేళ్లు

2011 World Cup: సరిగ్గా పదేళ్ల క్రితం 2011 ఏప్రిల్‌ 2న ముంబై వాంఖడే స్టేడియం మొత్తం హోరెత్తింది.

Samba Siva Rao
Published on: 2 April 2021 12:17 PM IST
2011 World Cup India Victory
X
ప్రపంచ కప్(ఫైల్ ఫోటో సోర్స్ Cricinfo)

2011 World Cup: సరిగ్గా పదేళ్ల క్రితం 2011 ఏప్రిల్‌ 2న ముంబై వాంఖడే స్టేడియం మొత్తం హోరెత్తింది. ఈ రోజును ప్రతి భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. వన్డే ప్రపంచ కప్ ను ఎమ్ఎస్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా నెగ్గింది. ప్రత్యర్థి జట్టు శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలోనే ఛేదించి ప్రపంచ విజేతగా నిలిచింది. ధోని ఫినిషెగ్ సిక్స్ ఎప్పటీకీ మరవలేనిది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు మరోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాదిండి. కపిల్‌ దేవ్ నాయకత్వంలో టీమిండియా ప్రపంచ కప్ సాధించిన తర్వాత మళ్లీ 28 ఏళ్లు పట్టింది.

శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన 49వ ఓవర్‌ రెండో బంతిని ధోని సిక్స్‌గా మలచిన షాట్‌ క్రికెట్ అభిమానుల మనస్సుల్లో పదేళ్లుగా అలా ముద్రించుకుపోయింది. క్వార్టర్స్‌లో ఆసీస్‌ను, సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన జట్టు ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4)అజేయ సెంచరీ చేసాడు. వికెట్ కీపర్ కుమార సంగక్కర (48: 67 బంతుల్లో 5x4) పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివరలో తిసారా పెరీరా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ ఒక వికెట్ దక్కింది.

లక్ష్యఛేదనకు దిగిన భారత్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35: 49 బంతుల్లో 4x4) కాసేపు నిలబడ్డాడు. సొంతగడ్డపై మ్యాచ్ ప్రత్యర్థి జట్టు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6)తో కలిసి గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 223 వద్ద గంభీర్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ ఫినిష్ చేసే బాధ్యత తీసుకున్న ధోనీ.. చివర్లో యువరాజ్ సింగ్ (21 నాటౌట్: 24 బంతుల్లో 2x4)తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో ఉత్కంఠ, ఉత్సాహం, సంతోషం, భావోద్వేగం, ఆనంద భాష్పాలు ఒకటేమిటి, ఇలా అన్ని రకాల భావనలు ఆ సమయంలో కనిపించాయి. అటు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకపోగా, అభిమానుల సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే.


టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011). వీటితో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో.. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. అప్పటివరకు సచిన్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో ప్రపంచకప్ అందుకోకపోవడంతో నిరాశతో ఉన్నాడు. కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌ను భుజానెత్తుకొని వాంఖడే స్టేడియంలో ఊరేగించిన దృశ్యాలు అభిమానుల కళ్లలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి. ఇక ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైయ్యాడు. ఫైనల్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ధోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story