నారదుడు స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను ఎక్కడుందో తెలుసా..

నారదుడు స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను ఎక్కడుందో తెలుసా..
x
Highlights

భారత దేశంలో ఉన్న ఎన్నో హిందూ దేవాలయాలలో పంచభావనారాయణ స్వామి క్షేత్రాలు కూడా ఎంతో ప్రసిద్ది గాంచినవి. పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం...

భారత దేశంలో ఉన్న ఎన్నో హిందూ దేవాలయాలలో పంచభావనారాయణ స్వామి క్షేత్రాలు కూడా ఎంతో ప్రసిద్ది గాంచినవి. పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం సర్పవరంలో వెలసిల్లింది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను. ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణం. శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. 'వైశాఖ శుద్ధ ఏకాదశి' రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుపబడుతుంది. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.

ఆలయ చరిత్ర

ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహాతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం (పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.

ఎక్కడ ఉంది

తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ మండలోని సర్పవరం గ్రామంలో ఈ కొలనులు ఉన్నాయి. సర్పవరం గ్రామం తూర్పు గోదావరి జిల్లా రాజధాని కాకినాడకు 5 కి.మీ దూరములో ఉంది. ఈ గ్రామంలో సర్పాలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతానికి 'సర్పవరం' అనే పేరు వచ్చిందని చెపుతుంటారు. సర్పవరం స్థల పురాణం బ్రహ్మవైవర్త పురాణములో చెప్పబడింది. అగస్త్య మహర్షి సర్పవరం గాథని సనకసనందనాదులకు చెబుతాడని చరిత్ర చెపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories