ఎవరీ సుమ్నిమా ఉదాస్‌?.. ఈమె పెళ్లి కోసమే నేపాల్‌కు రాహుల్‌..

Who is Sumnima Udas
x

ఎవరీ సుమ్నిమా ఉదాస్‌?.. ఈమె పెళ్లి కోసమే నేపాల్‌కు రాహుల్‌..

Highlights

Sumnima Udas: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేపాల్‌ నైట్‌ క్లబ్‌ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.

Sumnima Udas: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేపాల్‌ నైట్‌ క్లబ్‌ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య ట్వీట్ల సునామీకి రేగింది. ప్రధాని కావాలనుకుంటున్న ఓ వ్యక్తి ఇలా నైట్‌ క్లబ్‌లకు వెళ్లొచ్చా? అంటూ బీజేపీ విమర్శలను ఎక్కుపెట్టింది. రాహుల్ వెళ్లింది పాకిస్థాన్ ప్రధాని ఇంటికి కాదని.. స్నేహితురాలి పెళ్లికని.. వ్యక్తిగత పర్యటలనపై విమర్శలేమిటంటూ కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇస్తోంది. ఐదు రోజుల పర్యటనకు ఖాట్మాండు వెళ్లిన రాహుల్‌ గాంధీ నేపాలీ స్నేహితురాలు వివాహానికి వెళ్లారు. వివాహంలో భాగంగా నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ ఉన్న వీడియోలతో సోషల్‌ మీడియాలో బీజేపీ రెచ్చిపోయింది. ఈ వీడియోల్లో రాహుల్‌ పక్కన ఉన్న స్నేహితురాలు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఐదు రోజుల నేపాల్‌ పర్యటనలో ఉన్నారు. ఖాట్మాండులోని ఓ నైట్‌ క్లబ్‌లో స్నేహితురాలితో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోతో బీజేపీ హల్‌చల్‌ చేసింది. ఒకానొక దశలో అమె చైనా రాయబారిగా ప్రచారం జరిగింది. చైనా రాయబారితో నైట్‌ క్లబ్‌లో గడపడమేమిటని? కాబోయే ప్రధాని ఇలా చేయొచ్చా? అంటూ విమర్శల వర్షం కురిపించింది. ఈ వీడియో దొరికిందో లేదో.. బీజేపీ నాయకులు రెచ్చిపోయారు. ఈ వివాదంపై కాంగ్రెస్ దీటుగా కౌంటర్ ఇచ్చింది. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి జవడేకర్ షాంపైన్‌ పొంగిస్తున్న వీడియోను బయటపెట్టింది. రాహుల్‌ వెళ్లింది మిత్రదేశానికని శత్రు దేశం ప్రధాని ఇంటికి కాదని షెటైర్లు వేసింది. అయినా వ్యక్తిగత పర్యటనలపై విమర్శలేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరా రాహుల్‌ స్నేహితురాలు ఎవరో తెలుసుకున్న తరువాత ఈ వివాదం కాస్తా సద్దుమణిగింది.

ఇంతకు రాహుల్‌ స్నేహితురాలు ఎవరో కాదు నేపాల్‌ మాజీ రాయబారి కూతురు, జర్నలిస్టు సుమ్నమి ఉదాస్‌ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా పని చేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాలపై సుమ్నిమా అందించిన కథనాలు ఆకట్టుకున్నాయి. దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన దేశ రాజధానిలో జరిగిన నిర్బయ హత్యాచార ఘటనతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్‌ అవినీతి కుంభకోణం వంటి ఎన్నో అంశాలపై పరిశోధనాత్మక కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా సుమ్నిమా పేరు మార్మోగింది. ఆమె 2001 నుంచి 2017 వరకు సీఎన్‌ఎన్‌లో పని చేశారు. 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికలను కూడా ఆమె కవర్ చేశారు. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా ఆమె కొనసాగుతున్నారు.

సుమ్నిమా ఉదాస్‌ తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారి. ఆయన మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా పని చేశారు. దీంతో సుమ్నిమా ఉదాస్‌ చిన్నప్పటి నుంచి దాదాపు 10 దేశాల్లో నివసించారు. వర్జినియాలోని వాషింగ్టన్ అండ్ లీ యూనివర్శిటీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో బ్యాచిలర్ చేసిన ఉదాస్.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. లింగ సంబంధిత సమస్యలపై ఆమె కవర్‌ చేసిన కథనానికి 2014 మార్చిలో మహిళా సాధికారత జర్నలిజం అవార్డ్స్‌లో భాగంగా సుమ్నిమాకు 'జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. అలాగే భారత్‌లోని గ్రామాల్లో బానిసత్వం గురించి ఇచ్చిన కథనానికి 2012లో ప్రతిష్ఠాత్మక సినీ గోల్డెన్‌ ఈగల్‌ అవార్డును దక్కించుకున్నారు ఉదాస్‌.

అయితే సుమ్నిమా ఉదాస్‌ మోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పిస్తూ కథనాలు, సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2019లో సీసీఏ చట్టానికి, 2021లో ప్రారంభంలో మోదీ వ్యాక్సినేషన్ పాలసీ వంటివాటిపై ఆమె విమర్శలు గుప్పించారు. సరైన సమయంలో వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడంలో మోదీ ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆరోపించింది. అంతేకాకుండా ఇప్పుడు ఆమె చేసుకోబోతున్న వ్యక్తి కూడా చైనా మూలాలున్న నేపాలీ. చైనాలోని గౌంజ‌‌జౌ ప్రావిన్స్‌లో ఎస్‌ఎమ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ అనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీని నిర్వహిస్తున్న నిమా మార్టిన్‌ షెర్పాను సుమ్నిమా పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె వివాహం ఈనెల 5న జరగనున్నది. ఈ వివాహానికే రాహుల్‌ గాంధీ నేపాల్‌ రాజధాని ఖాట్మాండుకు వెళ్లారు. అయితే రాహుల్‌ గాంధీని సుమ్నిమా వివాహానికి తాము ఆహ్వానించామని నేపాల్‌ మాజీ రాయబారి భీమ్‌ ఉదాస్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories