నడ్డా కాన్వాయ్ దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‍‌ల డిప్యూటేషన్

Arun Chilukuri
Updated on: 12 Dec 2020 9:30 PM IST
నడ్డా కాన్వాయ్ దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‍‌ల డిప్యూటేషన్
X

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించి కేంద్రం, బెంగాల్ సర్కార్ మధ్య విభేదాలు ముదురుతున్నాయ్. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రంలోకి రప్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఈ పరిణామాలు ఇరుపక్షాల మధ్య మరింత వేడిని రాజేశాయ్. పశ్చిమబెంగాల్‌ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ భోల్‌నాథ్‌ పాండే, ప్రెసిడెన్సీ రేంజ్‌ డీఐజీ ప్రవీణ్‌ త్రిపాఠి, దక్షిణ బెంగాల్‌ అదనపు డీజీ రాజీవ్‌ మిశ్రాలను కేంద్రంలో పనిచేయాలని పిలిచింది. నడ్డా పర్యటనకు భద్రత కల్పించడంలో విఫలమైనందున ఈ సమన్లు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికారి తెలిపారు. ఆల్‌ ఇండియా సర్వీస్‌ ఆఫీసర్లపై ఉన్న నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సాధారణంగా అఖిల భారత సర్వీసు అధికారిని డిప్యుటేషన్‌పై కేందంలోకి తీసుకునేప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుంటారు. ఐతే తాజా ఘటనలో కేంద్ర హోంశాఖ బెంగాల్‌ ప్రభుత్వం సమ్మతి లేకుండానే ఏకపక్షంగా సమన్లు జారీ చేసింది. హోంశాఖ నిర్ణయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బెంగాల్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని హోంమంత్రి అమిత్ షా పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story