బాణసంచాపై నిషేధం విధించిన రాష్ట్రాలు ఇవే!

బాణసంచాపై నిషేధం విధించిన రాష్ట్రాలు ఇవే!
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ముఖచిత్రమే మారిపోయింది. ఆధ్యాత్మికతకు, పండుగలకూ నెలవైన భారత్‎లో దీపావళిది ప్రత్యేక స్థానం.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ముఖచిత్రమే మారిపోయింది. ఆధ్యాత్మికతకు, పండుగలకూ నెలవైన భారత్‎లో దీపావళిది ప్రత్యేక స్థానం. తాజాగా దీపాల పండుగపైనా కరోనా ప్రభావం పడింది. దేశంలో పండుగ వేళ నిర్వహించే బాణసంచాను నిషేధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది కొవిడ్ కారణంగా బోసిపోయిన పండుగల జాబితాలో దీపావళి కూడా చేరిపోతుందనే ఆందోళన ప్రజల్లో మొదలైంది.

ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో కర్ణాటక చేరింది. కరోనా విజృంభణ వేళ రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. బాణసంచా కాల్చడంతో వాయు కాలుష్యం మరింతగా పెరిగి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందన్న నిపుణుల సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ దీపావళికి బాణసంచాపై నిషేధం విధించే అంశంపై అధికారులతో చర్చించామని, ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.

అటు ఢిల్లీని ఓ వైపు వాయు కాలుష్యం వెంటాడుతుంటే.. మరోవైపు కరోనా మహమ్మారి కలవర పరుస్తోంది. దీంతో సీఎం కేజ్రీవాల్ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించారు. నవంబర్‌ 7 నుంచి 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు వాయు కాలుష్యం, కరోనా వైరస్‌, చలికాలంలో గాలి నాణ్యతపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఇప్పటికే ఒడిశా, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం ప్రకటించాయి. హర్యానా ప్రభుత్వం కూడా పాక్షికంగా నిషేధం విధించింది.

దిగుమతి చేసుకున్న బాణసంచా విక్రయాలను చట్టవిరుద్ధంగా పేర్కొంది. అయితే టపాసులు కాల్చేందుకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. బాణసంచాపై నిషేధం మాత్రం విధించలేదు. అటు కోల్‌కతాలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాళీ పూజ సమయంలోనూ బాణసంచా అమ్మకాలను కోల్‌కతా హైకోర్టు నిషేధించింది.

మరోవైపు బాణసంచా కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాజస్థాన్‌, ఒడిశా ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ రాశారు. తమిళనాడులో బాణసంచా ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా మరో 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధం కారణంగా ఉత్పత్తిదారులు, విక్రయదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దేశంలో బాణసంచా ఉపయోగంలో 90శాతం ఉత్పత్తి తమిళనాడులో జరుగుతోందన్నారు. నిబంధనల ప్రకారమే బాణసంచా తయారు చేస్తున్నారని, దీనివల్ల కాలుష్య సమస్య ఏర్పడదని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories