తమిళనాడులో భారీ వర్షాలు.. చన్నై సహా 8 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కడలూరు జిల్లాలో కుండపోత వానకు ఓ నివాసం కూలిపోవడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2025 11:23 AM IST
తమిళనాడులో భారీ వర్షాలు.. చన్నై సహా 8 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
X

తమిళనాడులో భారీ వర్షాలు.. చన్నై సహా 8 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కడలూరు జిల్లాలో కుండపోత వానకు ఓ నివాసం కూలిపోవడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడుతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. వాతావరణ శాఖ తమిళనాడులోని చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 13 జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తూత్తుకుడి, తిరువారూర్ జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, బోట్లు, చెట్లను తొలగించే యంత్రాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story