సీబీఐ కస్టడీలో వంద కేజీల బంగారం మాయం

సీబీఐ కస్టడీలో వంద కేజీల బంగారం మాయం
x
Highlights

అక్రమార్కులకు వణుకుపుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103కేజీల బంగారం అదృశ్యమైంది. ఆలస్యంగా...

అక్రమార్కులకు వణుకుపుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. తమిళనాడులో సీబీఐ కస్టడీ నుంచి 103కేజీల బంగారం అదృశ్యమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విచారణ జరపాలంటూ మద్రాసు హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఐతే స్థానిక పోలీసులతో దర్యాప్తు జరిపితే సంస్థ ప్రతిష్ఠ దిగజారుతుందని ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది సీబీఐకి అగ్నిపరీక్ష అని ఎలాంటి తప్పు లేకపోతే కేసు నుంచి క్షేమంగా బయటపడతారని కోర్టు వ్యాఖ్యానించింది. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. స్థానిక పోలీసులతో దర్యాప్తు వద్దు అని సీబీఐ అనడాన్ని కోర్టు తప్పుబట్టింది.

2012లో చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్‌పై నమోదైన ఓ కేసులో సీబీఐ ఆ కంపెనీ నుంచి 400 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బిస్కెట్లు, ఆభరణాల రూపంలో ఉన్న ఈ గోల్డ్‌ను కంపెనీ వాల్ట్‌లో లాక్‌ చేసి సీల్‌ వేసింది. ఈ వాల్ట్‌ తాళాలను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. 2013లో సురాణా కంపెనీపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ మొదటి కేసులో బంగారం స్వాధీనం అవసరం లేదని దాన్ని రెండో కేసుకు బదలాయించాలని కోర్టును కోరింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. ఐతే 2015లో సరైన సాక్ష్యాలు లేని కారణంగా కంపెనీపై ఉన్న రెండో కేసును మూసివేస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించింది. ఇందుకు అంగీకరించిన కోర్టు స్వాధీనంలో ఉన్న బంగారాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌కు అప్పగించాలని ఆదేశించింది.

సురాణా కంపెనీ రుణాల ఎగవేతపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు ప్రారంభించింది. ఈ కంపెనీ ఎస్‌బీఐకి వెయ్యి కోట్లకు పైగా చెల్లించాల్సి ఉన్నందున సీబీఐ స్వాధీనంలో ఉన్న బంగారాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో బ్యాంక్ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారం తిరిగి తిరిగి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యనల్‌కు చేరింది. దీనిపై 2019 డిసెంబరులో విచారణ జరిపిన ట్రైబ్యూనల్‌ సీబీఐ కస్టడీలో ఉన్న బంగారం మొత్తాన్ని సురాణా కంపెనీ చెల్లించాల్సిన బ్యాంకులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో సీబీఐ వాల్ట్‌లను తెరిచింది. అందులోని బంగారాన్ని తూకం వేయగా 103 కేజీలు తక్కువగా ఉంది. దీంతో అంతా షాకయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories