
ప్రభుత్వాలు ధనిక , పేద తేడా లేకుండా ఉచితంగా ఆహరం, విద్యుత్, గ్యాస్ అందించడం కాకుండా ఉపాధిపై దృష్టి పెట్టాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది
"ప్రభుత్వం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలకు ఉచితంగా ఆహారం, గ్యాస్, కరెంట్ ఇస్తూ పోతే, వారు ఎందుకు పని చేస్తారు? దీనివల్ల పని చేసే అలవాటు కోల్పోతారు. ప్రభుత్వం ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలి" అని గురువారం సుప్రీంకోర్టు ఉచితాల సంస్కృతిపై వ్యాఖ్యానించింది
పేదలకు సహాయం చేయడం అనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ, పేదా, గొప్ప తేడా లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించడం అంత సులభం కాదని కోర్టు పేర్కొంది. తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ లో వినియోగదారులందరికీ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్ను అందించాలని తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది.
దేశంలోని చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయని, అయినప్పటికీ అభివృద్ధిని విస్మరిస్తూ ఉచితాలను ప్రకటిస్తున్నాయని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
CJI సూర్యకాంత్ వ్యాఖ్యలు ఇవే..
- ప్రజలు జీవనోపాధి పొందగలిగేలా, వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా వారికి ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ నుంచి ప్రతిదీ ఉచితంగా పొందగలిగితే ప్రజలు ఎందుకు పని చేస్తారు? మనం నిర్మించాలనుకుంటున్న దేశం ఇదేనా?
- ఎన్నికల సమయంలో పథకాలు అకస్మాత్తుగా ఎందుకు ప్రకటిస్తారు? అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఇలాంటి దాతృత్వాన్ని కొనసాగిస్తే, దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాం. సమతుల్యత ఉండాలి. ఇది ఎంతకాలం కొనసాగుతుంది?
- భారతదేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? సంక్షేమ పథకం కింద, విద్యుత్ బిల్లులు చెల్లించలేని వారికి మీరు ఉపశమనం అందించడం అర్థం చేసుకోదగినదే. చెల్లించగలిగే స్తోమత ఉన్నవారు, చెల్లించలేని వారు అనే తేడా లేకుండా ఉచిత సేవలను అందించడం బుజ్జగింపు విధానం కాదా?
అసలు ఏమిటీ ఉచిత విద్యుత్ పిటిషన్?
విద్యుత్ సవరణ నిబంధనలు, 2024లోని 23వ నిబంధనను సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నిబంధన ప్రకారం వినియోగదారులందరికీ వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్ను ఆ సంస్థ ప్రతిపాదించింది. దీని ప్రకారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రతి రెండు నెలలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఎటువంటి షరతులు లేకుండా అందిస్తుంది. అంటే వినియోగదారుడు ఎంత వినియోగిస్తున్నా, మొదటి 100 యూనిట్లకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం - ఇతర పార్టీలకు కోర్టు నోటీసు జారీ చేసింది సుప్రీం కోర్టు. అంతేకాకుండా, తమిళనాడు కంపెనీ అకస్మాత్తుగా ఉచిత విద్యుత్తును ఎందుకు అందించాలని నిర్ణయించుకుందని కూడా కోర్టు ప్రశ్నించింది.
గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు..
ఉచితాల గురించి కోర్టు బలమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ఫిబ్రవరి 12, 2025న, సుప్రీంకోర్టు, "మీరు వారికి ఉచిత రేషన్ ఇస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడరు. మీరు ఏమీ చేయకుండా వారికి డబ్బు ఇస్తున్నారు" అని పేర్కొంది. ఈ వ్యక్తులను సమాజంలోని ప్రధాన స్రవంతితో అనుసంధానించడానికి బదులుగా, ఉచిత పథకాలను అమలు చేయడం ద్వారా మీరు పరాన్నజీవుల సమూహాన్ని సృష్టించడం లేదా? అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
డిసెంబర్ 9, 2024న, కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పంపిణీపై కోర్టు కూడా తీవ్ర వ్యాఖ్య చేసింది. "ఇంత ఉచిత రేషన్లు ఎంతకాలం పంపిణీ చేస్తూ పోతారు?" అని కోర్టు అడిగింది. ప్రభుత్వం ఉపాధి అవకాశాలను ఎందుకు సృష్టించడం లేదు? నైపుణ్యం లేని కార్మికులకు ఉచిత రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన కేసువిచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 810 మిలియన్ల మంది ఉచిత లేదా సబ్సిడీ రేషన్లను పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




