సౌరబ్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్... ఆరేళ్ల పాప కస్టడీ కోసం అయినవారి పోరాటం

Pavan Reddy
Published on: 5 April 2025 5:49 PM IST
Saurabh Rajput murder case latest news updates, Rohit Rajput and Muskan Rastogi parents demands Saurabhs daughter Pihu custody
X

సౌరబ్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్... ఆరేళ్ల పాప కస్టడీ కోసం అయినవారి పోరాటం

Saurabh Rajput murder case latest news updates: మీరట్‌లో సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరబ్ రాజ్‌పుత్ మర్డర్‌తో ఆయన ఆరేళ్ల కూతురు పిహు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సౌరబ్ కుటుంబం, ఆయన భార్య, నిందితురాలు అయిన ముస్కాన్ రస్తోగి కుటుంబాల మధ్య కొత్త పోరు మొదలైంది. ఆరేళ్ల పిహు ప్రస్తుతం ముస్కాన్ రస్తోగి తల్లిదండ్రుల వద్ద ఉంది. ప్రియుడు సాహిల్‌తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో ముస్కాన్ జైలుకు వెళ్లినప్పటి నుండి వారే ఆ చిన్నారి బాగోగులు చూసుకుంటున్నారు.

తన తల్లి చేతిలోనే తండ్రి సౌరబ్ హత్యకు గురైన విషయాన్ని ఆ ఆరేళ్ల చిన్నారి అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అమ్మానాన్న ఎక్కడ అని అడుగుతున్న ఆ చిన్నారికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ముస్కాన్ తల్లిదండ్రులది. నాన్న ఇక లేరని, అమ్మ జైలుకు వెళ్లిందని చెప్పలేక, వారు లండన్ వెళ్లారని, త్వరలోనే తిరిగి వస్తారని పిహుకు సర్దిచెప్పుతున్నారు.

పిహు కస్టడీ కోసం ఇరు కుటుంబాల పోరాటం

సౌరబ్ గారాలపట్టి హిహును తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సౌరబ్ అన్నయ్య రోహిత్ రాజ్‌పుత్ డిమాండ్ చేస్తున్నారు. తనకు బిడ్డలు లేరని, తన తమ్ముడి బిడ్డనే తన సొంత బిడ్డలా పెంచుకుంటానని రోహిత్ చెబుతున్నారు. సౌరబ్ బిడ్డలోనే సౌరబ్‌ను చూసుకుంటామని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తంచేస్తోంది. పిహు కళ్ల ముందు తిరుగుతుంటే, సౌరబ్ తమ కళ్ల ముందు ఉన్నట్లుగా ఉంటుందని ఆ కుటుంబం ఆశపడుతోంది.

అయితే, ముస్కాన్ జైలుకు వెళ్లడంతో ఇప్పుడు తమ ముందున్న ఏకైక ప్రపంచం ఆమె బిడ్డ పిహునే అని ముస్కాన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. "తన అల్లుడు సౌరబ్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వద్దు. తనే పిహును పెంచి పెద్ద చేస్తాను. అవసరమైతే అల్లుడి ఆస్తి నాకు అక్కర్లేదని రాతపూర్వకంగానైనా రాసిస్తా" అని ముస్కాన్ తండ్రి ప్రమోద్ రస్తోగి అంటున్నారు.

ప్రమోద్ రస్తోగి, రోహిత్ రాజ్‌పుత్ ఇద్దరూ పిహూ కస్టడీ కోరుతున్నారు. తమ్ముడి బిడ్డ పిహూను సొంతం చేసుకోవడం కోసం అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్ధమేనని రోహిత్ చెబుతున్నారు. మరోవైపు డ్రగ్స్ మత్తులో ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసిన ముస్కాన్, భర్త శవాన్ని ముక్కలుముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్‌తో సీల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముస్కాన్ డ్రగ్స్ దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ జైలు అధికారులను కూడా ముప్పుతిప్పలు పెడుతోంది. జైలుకు వచ్చిన తరువాత డ్రగ్స్ వినియోగం ఆగిపోవడంతో ఆమెలో డ్రగ్స్ విత్‌డ్రావల్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని జైలు అధికారులు తెలిపారు.

Pavan Reddy

Pavan Reddy

Next Story