రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ నిరాహార దీక్ష

Arun Chilukuri
Published on: 22 Sept 2020 12:21 PM IST
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ నిరాహార దీక్ష
X

రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ఆమోదం పొందే సమయంలో జరిగిన పరిణామాలతో ఎనిమిది మంది సభ్యులపై వేటు వేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు. అయితే, తమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా సోమవారం నుంచి పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర 8 మంది ఎంపీల నిరసన కొనసాగుతోంది. ఇక, ఇదే సమయంలో సెప్టెంబర్ 20న వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందే సందర్భంలో ఎంపీలు తనతో వ్యవహరించిన ప్రవర్తనకు వ్యతిరేకంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు.

వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ హరివంశ్‌ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు ఒక లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్ట లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో స్వీయ శుద్దీకరణ భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story