Sea Buckthorn: మోదీ మెచ్చిన 'మిరాకిల్ ఫ్రూట్'.. నారింజ కంటే 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి! దీని లాభాలు తెలిస్తే వదలరు

Sea Buckthorn: మోదీ మెచ్చిన మిరాకిల్ ఫ్రూట్.. నారింజ కంటే 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి! దీని లాభాలు తెలిస్తే వదలరు
x
Highlights

ప్రధాని మోదీ సూచించిన 'సీ బక్‌థార్న్' పండు విశేషాలు. లద్దాఖ్‌లో పండే ఈ లేహ్ బెర్రీలో నారింజ కంటే 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.

ప్రధాని నరేంద్ర మోదీ దేని గురించి చెప్పినా అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఆయన యువతకు సూచించిన ఓ ప్రత్యేకమైన పండు గురించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెర్చ్ ఇంజన్లు షేక్ అవుతున్నాయి. ఆ పండు పేరే 'సీ బక్‌థార్న్' (Sea Buckthorn). హిమాలయ సానువుల్లో, ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో ఎక్కువగా పండే ఈ పండును 'లేహ్ బెర్రీ' అని కూడా పిలుస్తారు.

ఏమిటి దీని ప్రత్యేకత?

నారింజ రంగులో మెరిసిపోయే ఈ చిన్న బెర్రీలు కేవలం పండ్లు మాత్రమే కాదు.. అద్భుతమైన ఔషధ గని. అందుకే దీనిని 'మిరాకిల్ ఫ్రూట్' లేదా 'సూపర్ ఫ్రూట్' అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం హిప్పోఫే రామ్నాయిడ్స్-ఎల్.

ఈ పండులో ఉన్న పోషకాలు ఇవే:

విటమిన్ల భాండాగారం: నారింజ పండుతో పోలిస్తే ఇందులో 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. దీనితో పాటు విటమిన్ ఏ, ఈ, కే మరియు బి-కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి.

ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు: సాధారణంగా చేపల్లో దొరికే ఒమేగా 3, 6, 9 ఆమ్లాలతో పాటు, అరుదుగా లభించే ఒమేగా 7 ఫ్యాటీ ఆమ్లం కూడా ఇందులో ఉంటుంది.

బయో యాక్టివ్ సమ్మేళనాలు: ఇందులో 200లకు పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

ఆరోగ్య ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తి: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, జ్వరాల నుంచి రక్షణ కల్పిస్తాయి.

గుండె ఆరోగ్యం: హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో, బీపీని నియంత్రించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

జీర్ణ వ్యవస్థ: అల్సర్లను నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లను అడ్డుకుంటుంది.

జ్ఞాపకశక్తి: నాడీ సంబంధిత సమస్యలను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

చర్మ సౌందర్యం: ఒమేగా 7 ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. అందుకే దీనిని కాస్మెటిక్స్, ఆయిల్‌లో ఎక్కువగా వాడుతున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ..

ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది -40 డిగ్రీల చలిని మరియు +40 డిగ్రీల ఎండను కూడా తట్టుకుని పెరుగుతుంది. ప్రాచీన టిబెటన్, చైనా వైద్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. ప్రస్తుతం మన దేశంలోని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్' (CSIR) లద్దాఖ్‌లో ఈ పండ్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

ఈ పండును నేరుగా గానీ, జ్యూస్, జామ్, హెర్బల్ టీ లేదా పౌడర్ రూపంలో గానీ తీసుకోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు ఈ 'లేహ్ బెర్రీ'ని తమ డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories