Tamilnadu: తమిళనాడులో ముదురుతున్న హిందీ వివాదం.. మరో భాషా యుద్ధానికి మేం సిద్ధమే.. స్టాలిన్


తమిళనాడులో ముదురుతున్న హిందీ వివాదం.. మరో భాషా యుద్ధానికి మేం సిద్ధమే.. స్టాలిన్
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాలల్లో ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు హిందీ లాంగ్వేజ్ను కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే హిందీ భాషను ప్రవేశపెట్టేందుకు తమిళ సర్కార్ ససేమిరా అంటోంది.
Tamilnadu: నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)2020 ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం.. ఆ ఆదేశాలను తమిళనాడు సర్కార్ తిరస్కరించడం వివాదానికి కారణమైంది.
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాలల్లో ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు హిందీ లాంగ్వేజ్ను కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే హిందీ భాషను ప్రవేశపెట్టేందుకు తమిళ సర్కార్ ససేమిరా అంటోంది. అది భవిష్యత్తులో తమిళభాషను మరుగున పడేస్తుందని వాదిస్తోంది. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గిందని చెబుతోంది. అయితే తమిళ ప్రభుత్వ వాదనను కేంద్రం ఖండిస్తోంది. స్టాలిన్ ప్రభుత్వ వాదనలో నిజం లేదని అంటోంది. విద్యార్థులకు అదనంగా మరో భాషను నేర్పడం వల్ల నష్టం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు విద్యానిధులు అందజేయబోమని హెచ్చరించింది.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని ఇప్పటికే సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీని బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తమ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇచ్చినా కూడా ఎన్ఈపీని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యను రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను నిలిపివేస్తోందని మండిపడ్డారు. అంతేకాదు తమిళనాడు మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ విద్యా విధానాన్ని స్వీకరించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రానికి దాదాపు రూ.2400 కోట్ల నిధులు కేటాయించమని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం మరింత దుమారం లేపింది. దీనిపై స్పందించిన స్టాలిన్ రూ.2 వేల కోట్ల కోసం మా హక్కులు వదులుకోలేమని తెగేసి చెప్పారు. నూతన విద్యా విధానం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని.. తమిళ భాషకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీన్ని అమలు చేస్తే తమిళనాడును 2000 సంవత్సరాలు వెనక్కి నెట్టినట్టేనని అన్నారు. ఇది తమ రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందన్నారు. తాము ఏ భాషను వ్యతిరేకించడం లేదని.. కానీ తమపై ఏదైన భాషను బలవంతంగా రుద్దితే మాత్రం ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఈ అంశం తమిళనాడు హక్కులకు సంబంధించినదని.. పార్టీలకు అతీతంగా ఈ అంశంపై స్పందించాలన్నారు.
తమిళనాడులో ప్రాంతీయ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. హిందీ భాష వల్ల తమ భాషకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. అయితే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఇప్పటిది కాదు. మొదటిసారిగా 1937లోనే జరిగింది. మద్రాసు ప్రెసిడెన్సీలో సి.రాజగోపాల చారి నేతృత్వంలో భారతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధనను అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీంతో అప్పట్లోనే మద్రాసులో హిందీ వ్యతిరేకోద్యమం జరిగింది. ఈవీ రామస్వామి నాయకర్ (పెరియార్), పన్నీర్ సెల్వం నాయకత్వంలోని విపక్ష జస్టిస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. రాష్ట్రవ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. చివరికి 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు. మూడేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో 1198 మంది అరెస్ట్ కాగా ఇద్దరు మరణించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 జనవరి 26న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అనేక హిందీయేతర రాష్ట్రాలు హిందీని ఏకైక అధికార భాషగా చేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. 1965, 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో త్రిభాష సూత్రం ద్వారా తమపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు NEPకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఇలా ఆందోళనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల అధికార డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగు వేశారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులతో పాటు వివిధ చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలకు నల్ల రంగు వేస్తున్నారు. పాలైయంకొట్టే, పాలక్కాడ్ రైల్వే స్టేషన్లోని బోర్డులకు అలాగే చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, జీఎస్టీ రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని హిందీ అక్షరాలకు నల్ల రంగు వేశారు.
ఇదిలా ఉంటే హిందీ భాషను వ్యతిరేకిస్తున్న డీఎంకే పై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై మండిపడ్డారు. త్రిభాషా విధానంపై డీఎంకే పార్టీ కపటత్వం చూపిస్తోందని విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల పిల్లలు బహు భాష పాఠశాలల్లో చదువుకున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. డీఎంకే రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఫైరయ్యారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



