Soli Sorabjee: సోరాబ్జీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం

Soli Sorabjee: కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్నీ జనరల్‌, పద్మవిభూషణ్‌ సొలి జహంగీర్‌ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు.

Arun Chilukuri
Published on: 30 April 2021 1:38 PM IST
Leaders Condolences Over the Death of Former AG Soli Sorabjee
X

సొలి జహంగీర్‌ సొరాబ్జీ (ఫైల్ ఫోటో )


Soli Sorabjee: కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్నీ జనరల్‌, పద్మవిభూషణ్‌ సొలి జహంగీర్‌ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. సొలి జహంగీర్‌ సోరాబ్జీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

1930లో ముంబయిలో జన్మించిన సోరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్‌ అడ్వొకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐక్యరాజ్య సమితి ఆయనను ప్రతినిధిగా పంపింది. అనంతరం ఐరాస 'ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌' ఉప సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొరాబ్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సొరాబ్జీ వాదనలు మానవ హక్కుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపాయని ఈ సందర్భంగా సీఎం జగన్‌ గుర్తు చేశారు.

ప్రముఖ లాయర్, మాజీ అటార్నీ జనరల్, పద్మ విభూషణ్ సోలి సోరాబ్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story