Jaishankar: అణ్వాయుధ బెదిరింపులకు భారత్‌ ఎప్పటికీ లొంగదు

Jaishankar: భారత్‌ ఎప్పటికీ అణ్వస్త్ర బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ తేల్చిచెప్పారు.

Arun Chilukuri
Published on: 1 July 2025 11:40 AM IST
India Never Bows to Nuclear Threats Jaishankar un Pakistan Terrorism
X

Jaishankar: అణ్వాయుధ బెదిరింపులకు భారత్‌ ఎప్పటికీ లొంగదు

Jaishankar: భారత్‌ ఎప్పటికీ అణ్వస్త్ర బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ తేల్చిచెప్పారు. ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌ తరఫున వస్తున్న అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌లకు ఏమాత్రం భయపడదని, దేశ రక్షణ కోసం అవసరమైతే ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

జైశంకర్‌ మాట్లాడుతూ, పాక్‌ ప్రోత్సహణతో దేశంలో ఇటీవల వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయని, అలాంటి దాడులకు సమాధానంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' నిర్వహించిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌ ద్వారా దాయాది దేశానికి గట్టి సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చెందడాన్ని తట్టుకోలేకే పాక్‌ ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ దాడిని ఆర్థిక యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ, పర్యాటకాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఇది జరిగిందని విమర్శించారు.

ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదులంతా పాక్‌లోనే స్వేచ్ఛగా సంచరిస్తున్నారని జైశంకర్‌ ఆరోపించారు. పట్టపగలే పెద్ద నగరాల్లో నుంచే ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని, వాళ్లు ఎక్కడున్నారో, ఏమి చేస్తుండో భారత్‌కు తెలుసని హెచ్చరించారు. పాక్‌ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని విమర్శించారు.

ఉగ్రవాదులను ప్రోత్సహించే ప్రభుత్వాలు, వారికి సహకరించే దేశాలకు భారత్‌ తగిన శిక్ష విధిస్తుందని జైశంకర్‌ హెచ్చరించారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేసినా, దేశ రక్షణ విషయంలో భారత్‌ ఏమాత్రం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

భారత్‌-పాక్‌ మధ్య దాడులను ఆపేందుకు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న ప్రచారాన్ని జైశంకర్‌ తిప్పికొట్టారు. అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య చర్చలకు పాక్‌తో ఉన్న ఉద్రిక్తతలతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story