Bengal Election 2021: బెంగాల్ లో ప్రారంభమైన 5వ విడత పోలింగ్

Kranthi
Published on: 17 April 2021 7:50 AM IST
Fifth Phase of Election in West Bengal Begins
X

Bengal Election 2021:(File Image)

Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. బెంగాల్‌ వాసులు తమ ఓటును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పోలింగ్‌ మొదలుకాకముందే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 8 విడతలుగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార సమయంలో తీవ్ర ఘర్షణలూ చెలరేగాయి.

ఇక పోలింగ్ జరగనున్న 45 నియోజకవర్గాలు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పోలింగ్ లో పాల్గొనబోయే ఓటర్లు 1.12 కోట్లు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,789. 319 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థినుల సంఖ్య 39. రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతలలో 135స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు 159. ఐదో విడతలో 45 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.

బెంగాల్‌ నాలుగో దశ ఎన్నికల్లో హింస చెలరేగింది. రెండు ఘటనల్లో ఐదుగురు మరణించారు. రెండు సంఘటనలపైనా టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒక ప్రాంతంలో పోలింగ్‌ జరుగుతుంటే..మరో ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. నాలుగో దశ ఎన్నికల్లో 76.16 శాతం పోలింగ్ నమోదైంది.

Kranthi

Kranthi

Next Story