రైతు సంఘాల ఆందోళనపై స్పందించిన కేంద్రం

రైతు సంఘాల ఆందోళనపై స్పందించిన కేంద్రం
x
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పందించింది. వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ప్రతినిధులతో...

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పందించింది. వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రకటనపై రైతు సంఘాలు ఇప్పటి వరకు స్పందించలేదు. చర్చలకు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్షను చేపట్టారు. చలో ఢిల్లీలో భాగంగా ఢిల్లీ– జైపూర్‌ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు షాజహాన్‌పూర్‌ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు. రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్‌ జిల్లా షాజహాన్‌పూర్‌ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. రైతుల నిరసనల కారణంగా జైపూర్‌–ఢిల్లీ హైవే ట్రాఫిక్‌ను ఆల్వార్‌ జిల్లా బన్సూర్‌ తదితర మార్గాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు చేపట్టిన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిల్లా మీదుగా వెళ్లే నోయిడా– ఢిల్లీ లింక్‌ రోడ్డులోని రవాణా వాహనాలు వెళ్లే ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఇక్కడ రైతులు ధర్నా కొనసాగిస్తున్నారు.

కేంద్రం అహంకారం వీడి కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇవాళ్టి రైతు సంఘాల పిలుపు మేరకు తనతో పాటు ఆప్‌ పార్టీ కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష పాటిస్తారని ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళనలను మావోయిస్టులు, వామపక్ష పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులు హైజాక్‌ చేశాయంటూ కొందరు కేంద్ర మంత్రులు ఆరోపించడంపై ఎన్‌సీపీ తీవ్రంగా స్పందించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories