తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత..!

* పాడేరులో 12, మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత.. అరకు లోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

R Tripura Malini
Updated on: 17 Nov 2022 8:33 AM IST
Cold Wave In Telugu States
X

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో చలికాల ప్రభావం మొదలయ్యింది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ఉదయం చలి గాలుల తీవ్రత పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి బీభత్సంగా కన్పిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది.

మరోవైపు ఏపీలో చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ఇక పాడేరులో 12, మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అరుకు లోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే నాలుగు రోజులు చలి తీవ్రత మరింతగా ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story