భారత సరిహద్దులోకి డ్రాగన్ కంట్రీ సైనికుడు

Arun Chilukuri
Updated on: 9 Jan 2021 9:00 PM IST
భారత సరిహద్దులోకి డ్రాగన్ కంట్రీ సైనికుడు
X

సరిహద్దు వివాదంతో లద్దాఖ్‌లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని శుక్రవారం భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయ్. తెల్లవారుజామున పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంట అతన్ని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారమే ఆ సైనికుడిని విచారిస్తున్నామని సరిహద్దు దాటాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. జవాను గురించి చైనా సైన్యానికి కూడా సమాచారం అందించినట్లు వెల్లడించారు.

చైనా జవాన్ భారత భూభాగంలోకి రావడం గత నాలుగునెలల్లో ఇది రెండోసారి. గతేడాది అక్టోబరులో తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌ సెక్టార్‌లో పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడురోజుల దర్యాప్తు తర్వాత అతడు తిరిగి ఆ దేశానికి వెళ్లాడు. లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయ్. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు వివాదంతో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్ల ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story