Karnataka: స్టేషన్‌లో పిల్లులను పెంచుతున్న పోలీసులు

Karnataka: ఎలుకల బెడదను అరికట్టేందుకు రంగంలోకి పిల్లులు

Rama Rao
Published on: 28 Jun 2022 4:49 PM IST
Cats give Gauribidanur Rural Cops Respite From Rat Menace
X

Karnataka: స్టేషన్‌లో పిల్లులను పెంచుతున్న పోలీసులు

Karnataka: సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు కుక్కలను పోలీసులు పెంచుతారు. వాటి ఆలనాపాలనా చూసుకునేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. కానీ.. ఓ పోలీసు స్టేషన్‌లో మాత్రం విచిత్రంగా రెండు పిల్లులను పెంచుతున్నారు. వాటిని ఎంతో శ్రద్దగా చూసుకుంటున్నారు. ఆ పిల్లులు ఎంచక్కా ఎస్‌ఐ టేబుల్‌పైనా పైళ్లపైనా స్టేషన్‌లో యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టేషన్‌ అధికారుల సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నాయి. అసలు పిల్లులను పెంచడం ఏమిటి? అవి స్టేషన్‌ అధికారుల సమస్యలకు పరిష్కారం చూపడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?.. అయితే మీరు కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలోని గౌరీబిదనూరు రూరల్‌ పోలీసు స్టేషన్ చూడాల్సిందే.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలోని గౌరీబిదనూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌ను 2014లో నిర్మించారు. అయితే ఈ స్టేషన్‌లో ఇటీవల ఎలుకల బెడద అక్కడి పోలీసు అధికారులను ఆందోళన కలిగిస్తోంది. తరచూ స్టేషన్‌లోకి వస్తున్న ఎలుకలు.. పైళ్లను కొరకడం ప్రారంభించాయి. ఈ ఎలుకల బెడద నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ఎననో ప్రయత్నాలు చేసినా వాటిని అరికట్టలేకపోయారు. దీంతో ఎలుకల ఆట కట్టించేందుకు రెండు పిల్లలను రంగంలోకి మోహరించారు. ఆ పిల్లులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అవి స్టేషన్‌లోని ఎలుకలను వేటాడుతున్నాయి. అధికారుల సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి.

గౌరీబిదనూరు రూరల్ పోలీసు స్టేషన్‌కు దగ్గరలోనే సరస్సు ఉందని.. ఎలుకలు తమ స్టేషన్‌ను మంచి ఆవాసంగా మార్చుకున్నాయని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. స్టేషన్‌లో ఎక్కడ ఫైలు పెట్టినా.. ఎలుకలు కొరికేస్తున్నాయని వాటిని పట్టుకునేందుకు యత్నిస్తే.. సెల్‌లు, గదుల్లోకి పరిగెడుతున్నట్టు ఎస్ఐ చెప్పారు. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరికి ఓ పిల్లిని రంగంలోకి దించడంతో ఎలుకల బెడద తగ్గింది. ఇప్పుడు మరో పిల్లిని కూడా తీసుకొచ్చామని విజయ్‌ కుమార్‌ వివరించారు. రెండు పిల్లలకు పాలు, ఆహారాన్ని అందిస్తున్నామని.. అవి ఇప్పుడు తమ కుటుంబ సభ్యుల్లా మారాయాని ఆనందంగా విజయ్ కుమార్‌ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story