రసవత్తరంగా మారుతున్నబెంగాల్‌ రాజకీయాలు

Arun Chilukuri
Published on: 21 Nov 2020 1:30 PM IST
రసవత్తరంగా మారుతున్నబెంగాల్‌ రాజకీయాలు
X

బెంగాల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు సిద్ధమౌతున్నాయి. మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే కమలదళానికి కౌంటర్‌ ఇవ్వాలని దీదీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. బీజేపీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనేక వ్యూహాలను వేస్తోంది. ఇప్పటికే పార్టీలో బలమైన నాయకులను బెంగాల్‌కి బీజేపీ హైకమాండ్ పంపటం జరిగింది. ఎలాగైనా మమతా బెనర్జీని సీఎం పీఠం నుండి దింపాలని ఆలోచనలు చేస్తోంది.

బీహార్ రాష్ట్రంలో కొద్దిపాటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి అదే వేవ్ బెంగాల్ రాష్ట్రంలో కూడా కొనసాగించాలని తెగ ఆరాటపడుతోంది. బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సరిసమానంగా ఆర్జేడీ కూటమి కూడా సీట్ల సంపాదించింది. అతికొద్ది మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఎక్కువగా బిజెపి గెలవడానికి గల కారణాలు చూస్తే ఓట్లు చీలిపోవడమే అని ఎంఐఎం పార్టీ పోటీ చేసిన ప్రతిచోట ఆర్జెడి విజయావకాశాలను దెబ్బ కొట్టడం జరిగిందని, దీంతో బీహార్ రాష్ట్రంలో జరిగిన తప్పు పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో జరగకూడదని మమతా బెనర్జీ డిసైడ్ అయ్యారట.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు ఐదవ వంతు అంటే 60కి పైగా ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లు కావటంతో ఆ ప్రాంతాలలో మజ్లిస్ పార్టీ పోటీకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే కచ్చితంగా మళ్లీ బీహార్ రిజల్ట్ పశ్చిమబెంగాల్లో రిపీట్ అవుతుందని, దీంతో బీజేపీ గెలిచే అవకాశాలు వస్తాయని దీదీ జాగ్రత్త పడుతున్నారట. దీంతో జరగబోయే ఎన్నికలలో భేషజాలు పక్కనపెట్టి మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్నట్లు పోత్తులు అంతా ఓకే అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమలం పార్టీ గెలవటం చాలా కష్టమని పరిశీలకులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story