ద్రౌపది పేరును ప్రకటించి విపక్షాలకు షాకిచ్చిన బీజేపీ

Presidential Election: ద్రౌపది పేరును ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

Jyothi
Updated on: 22 Jun 2022 5:06 PM IST
BJP Declares Draupadi Murmu as President Candidate
X

ద్రౌపది పేరును ప్రకటించి విపక్షాలకు షాకిచ్చిన బీజేపీ

Presidential Election: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో రాష్ట్రపతి ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. భారత రాష్ట్రపతిగా పోయినసారి ఈమె పేరు తెరపైకి వచ్చినా చివరి ఈక్వేషన్స్‌లో రాంనాథ్ కోవింద్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే మరోసారి రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ప్రకటించి విపక్షాలకు షాకిచ్చింది బీజేపీ. గిరిజన తెగకు చెందిన నేతే కాకుండా జార్ఘండ్ గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ద్రౌపది ముర్ముకు ఉండడంతో..ఆసారి జరిగే రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను విపక్షాలు ప్రకటించడంతో..యశ్వంత్ సిన్హా వర్సెస్ ద్రౌపతి ముర్ము మధ్య పోరు కొనసాగనుంది.

ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె మయూర్‌భంజ్‌లోని రాయంగ్‌పూర్ నుంచి 2000, 2009లో బిజెపి టిక్కెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.

అంతకుముందు 1997లో రాయంగ్‌పూర్ నగర్ పంచాయతీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. BJP తరపున షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, 2000లో రాయంగ్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్యకాలంలో వాణిజ్యం, రవాణా శాఖ, ఆ తరువాత ఫిషరీస్, జంతు వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్లు పూర్తికాలం గవర్నర్ పదవిలో కొనసాగారు.

వాస్తవానికి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై బీజేపీ అధిష్టానం భారీ కసరత్తే చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో..ద్రౌపది ముర్ము పేరును ప్రకటించి విపక్షాలకు బిగ్ షాకిచ్చింది మోడీ సర్కార్. ఆజాది అమృతోత్సవంలో భాగంగా ద్రౌపదికి అవకాశం ఇస్తే, తొలిసారి గిరిజన మహిళ దేశానికీ రాష్ట్రపతి అయి రికార్డు సృష్టించనున్నారు.


Jyothi

Jyothi

Next Story