బెంగాల్‌లో ఎన్నికల హీట్ : నడ్డా అలా వెళ్లగానే.. ఇలా అమిత్ పర్యటన

Arun Chilukuri
Updated on: 2 Jan 2021 10:00 PM IST
బెంగాల్‌లో ఎన్నికల హీట్ : నడ్డా అలా వెళ్లగానే.. ఇలా అమిత్ పర్యటన
X

ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే బెంగాల్ రాజకీయం భగ్గుమంటోంది. బీజేపీ, టీఎంసీ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం పీక్స్‌కు చేరగా మరోసారి రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు నడ్డా ! కాన్వాయ్ దాడి ఘటన వివాదం ఇంకా చల్లారకముందే ఆయన మళ్లీ పర్యటనకు సిద్ధమవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిత్ షా కూడా మళ్లీ బెంగాల్ వెళ్తారని పార్టీవర్గాలు చెప్తున్నాయ్.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ రాజకీయం భగ్గుమంటోంది. వలసలు సలసల రేపుతున్నాయ్. సువేందు అధికారితో పాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే టీఎంసీ నుంచి బీజేపీలోకి జంపింగ్ జపాంగ్ అన్నారు. దీనిపై దీదీ కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారనుకోండి ! ఇక టీఎంసీ పని అయిపోయిందని 2వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే అంత సీన్ లేదు 30కంటే ఎక్కువ రావడమే గగనమని మమతా కౌంటర్ ఇచ్చారు. ఇక అటు అమిత్ షా వ్యాఖ్యలకు కూడా దీదీ కౌంటర్ ఇవ్వడంతో ఆరు నెలల ముందుగానే పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది బెంగాల్‌లో !

నెలరోజుల కింద బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా బెంగాల్‌లో పర్యటించగా తీవ్ర ఉద్రిక్తతలు కనిపించాయ్ అప్పుడు ! కాన్వాయ్‌పై దాడి చేశారు కొందరు. టీఎంసీ, బీజేపీ మధ్య ఈ వ్యవహారంలోనూ మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజుల తర్వాత మరోసారి నడ్డా బెంగాల్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 9న బెంగాల్‌లోని బీర్భమ్‌లో ఆయన పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయ్. పర్యటనలో భాగంగా ఆయన రోడ్‌షోలో పాల్గొంటారు. పార్టీ సీనియర్ నేతలతో నడ్డా ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

నడ్డా పర్యటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్‌ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల మూడోవారంలో ఆయన పర్యటించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన తర్వాత కొన్నిరోజులకు అమిత్ షా బెంగాల్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే టీఎంసీ కీలక నేత అయిన సువేందు అధికారి దీదీకి షాక్ ఇస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఐతే ఇప్పటికే బెంగాల్‌లో వలసలు జోరందుకున్న సమయంలో అమిత్ షా పర్యటన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. దీంతో ఆ రాష్ట్రంపై బీజేపీ దృష్టిసారించింది. బెంగాల్‌లో పాగా వేసేందుకు కట్టుదిట్టమైన వ్యూహరచన చేస్తోంది. కీలక నేతలను రంగంలోకి దింపుతోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story