Superbug: కరోనాకంటే ప్రమాదకారి "సూపర్‌బగ్‌" గుర్తింపు

Another Pandemic Superbug on the Andaman Islands
x

Superbug: (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Highlights

Superbug: ఔషధాలను సైతం బేఖాతరు చేసే ‘సూపర్‌బగ్’గా పిలిచే బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో బయటపడ్డాయి.

Superbug: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ప్రపంచ దేశాలకు మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఔషధాలను సైతం బేఖాతరు చేసే 'సూపర్‌బగ్'గా పిలిచే బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో బయటపడ్డాయి. అండమాన్‌ దీవుల్లో గుర్తించిన ఈ సూపర్‌బగ్‌ ఆనవాళ్లు, రానున్న రోజుల్లో మరో మహమ్మారికి దారితీసే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఔషధాలకు లొంగని...

కరోనా మహమ్మారి విజృంభణ వేళ ఔషధాలకు లొంగని సీ.ఆరిస్ (క్యాండిడా ఆరిస్) అనే బ్యాక్టీరియా ఆనవాళ్లను తొలిసారిగా అండమాన్‌ దీవుల్లో గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. సూపర్‌బగ్‌గా పిలిచే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియాను కనుక్కోవడం ఓ మైలురాయిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో, రానున్న రోజుల్లో ఈ సూపర్‌బగ్‌ మహమ్మారిగా విజృంభించే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఈ సూపర్‌బగ్‌ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తున్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అండమాన్‌ దీవుల్లో...

ఢిల్లీకి చెందిన డాక్టర్‌ అనురాధా చౌధరీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలో భాగంగా, అండమాన్‌ దీవుల్లోని దాదాపు ఎనిమిది ప్రాంతాల నుంచి 48 ఇసుక, నీటి నమూనాలను సేకరించారు. అక్కడి ఇసుక, రాతి బీచ్‌లు, చిత్తడి నేలలు, మడ అడవుల నుంచి ఈ నమూనాలను సేకరించి పరీక్షించారు. మానవులు తిరగని క్షార స్వభావం కలిగిన నేలలతో పాటు మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్‌ల సేకరించిన ఈ నమూనాలలో సీ.ఆరిస్‌ను వేరుచేసి పరీక్షించారు. క్షార స్వభావ నేలలతో పోలిస్తే మానవులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో కనిపించిన సీ.ఆరిస్‌.. ఔషధాలకు లొంగనిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఈ సూపర్‌బగ్‌ అండమాన్‌లోనే జీవించి ఉంటుందనే విషయం రుజువు కాలేదని స్పష్టంచేశారు. మానవుల ద్వారా ఈ సూక్ష్మజీవులు (మైక్రోబ్స్‌) ఎక్కడ నుంచైనా రావొచ్చని, ముఖ్యంగా మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్‌లలో ఇది సాధ్యమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

సూపర్‌బగ్‌ వల్ల వచ్చే లక్షణాలు..

జ్వరం, తీవ్ర చలి వంటి లక్షణాల కంటే ముందు సూపర్‌బగ్‌ వల్ల వచ్చే లక్షణాలను అంత తేలికగా గుర్తించలేము. వాటిని తగ్గించేందుకు ఔషధాలు వాడినప్పటికీ అవి తగ్గే అవకాశం తక్కువ. ఒక్కోసారి తీవ్రత ఎక్కువై ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. సూపర్‌బగ్‌గా పిలిచే ఈ క్యాండిడ్‌ ఆరిస్‌ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించే ముందు కొంతసమయం పాటు చర్మంపై జీవిస్తుంది. ఇది రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ప్రమాదకరమైన 'సెస్పిస్‌'కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఔషధాలకు లొంగని గుణమున్న ఈ సూక్ష్మజీవులను అదుపుచేయడం కష్టమని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) కూడా చెబుతోంది. దీంతో ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో 2019లో సీడీసీ చేర్చింది.

మిస్టరీగానే...

అత్యంత ప్రమాదకారిగా భావిస్తున్న ఈ సూపర్‌బగ్‌ ఎలా వ్యాపిస్తోందన్న విషయం మిస్టరీగా మిగిలింది. అయితే, వాతావరణ మార్పుల కారణంగా ఇది వ్యాపిస్తుందని పరిశోధకులు ఇది వరకు అంచనా వేశారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ ఫంగస్‌ మానవులకు సోకుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా 2009 సంవత్సరంలో ఈ సూపర్‌బగ్‌ను జపాన్‌లోని ఓ రోగిలో గుర్తించారు. బ్రిటన్‌లోనూ ఈ సూక్ష్మజీవి ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడి ప్రజారోగ్య విభాగం నివేదిక ప్రకారం, 2019 నాటికి బ్రిటన్‌లో దాదాపు 270 మందిలో దీన్ని గుర్తించగా వీరిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు సూపర్‌బగ్‌ కారణమని చెప్పడానికి ఆధారాలు మాత్రం లేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, రానున్న రోజుల్లో ఇతర మహమ్మారుల ముప్పుపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. .

Show Full Article
Print Article
Next Story
More Stories