కామెడీని కొత్త పుంతలు తొక్కించిన హాస్యబ్రహ్మ

తెలుగు సినిమా చరిత్రలో హాస్యనికి పెద్ద పీట వేసిన దర్శకులలో జంధ్యాల ఒకరు. హాస్యకథా చిత్రాలు తీయటంలో ఆయనది అందె వేసిన చెయ్యిని చెప్పాలి.

Krishna
Updated on: 15 Jan 2020 1:38 PM IST
కామెడీని కొత్త పుంతలు తొక్కించిన హాస్యబ్రహ్మ
X

తెలుగు సినిమా చరిత్రలో హాస్యనికి పెద్ద పీట వేసిన దర్శకులలో జంధ్యాల ఒకరు. హాస్యకథా చిత్రాలు తీయటంలో ఆయనది అందె వేసిన చెయ్యిని చెప్పాలి. జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండడంతో అయన స్వయంగా నాటకాలు రచించాడు. అలా ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలకి గాను అనేక బహుమతులు అందుకున్నారు.

నాటక రంగంలో ఆయనకి ఉన్న అసక్తి ఆయనని సినిమారంగం వైపు అడుగులు వేయించింది. అలా రచయతగా జంధ్యాల తొలి చిత్రంగా సిరిసిరి మువ్వ తెరకెక్కింది. తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో ఆకట్టుకున్నారు జంధ్యాల. జంధ్యాలను కళాతపస్వీ కె.విశ్వనాథ్ ఎక్కువగా ప్రోత్సహిస్తూ వచ్చారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన శంకరాభరణం, సాగరసంగమం ఇలా ప్రతి సినిమా మంచి హిట్టు అయింది. జంధ్యాల ఐదేళ్ళలో సుమారుగా 85 సినిమాలకు రచయితగా పనిచేయగా, అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించాయి.

మాటల రచయితగానే ఉంటూనే దర్శకుడి అవతారం ఎత్తారు జంధ్యాల.. ముద్ద మందారం సినిమాతో తొలి సక్సెస్ ని సాధించిన జంధ్యాల ఆ తర్వాత ఇంటిల్లిపాది నవ్వుకునే హాస్యప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకి అందజేశారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమకి బ్రహ్మానందం, నరేష్, ప్రదీప్, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు లాంటి గొప్ప నటులను పరిచయం చేశారు . ఇక అహనా పెళ్ళంట సినిమాలో రాజేంద్రప్రసాద్ , చంటబ్బాయి సినిమాలోని చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ని బయటికి తీసిన ఘనత జంద్యాలకే దక్కుతుంది.

అయన సినిమాల్లోని టైటిల్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. సరిగ్గా పరిశీలిస్తే అవన్నీపాత సినిమాల్లోని పాటలలోని పల్లవులు. దీన్నిబట్టి చూస్తే జంద్యాల సాహిత్యానికి ఎంత విలువ ఇస్తారో అర్ధం అవుతుంది. మాటల రచయితగా, దర్శకుడిగా మాత్రమే కాదు. నటుడుగా రాణించి మెప్పించారు జంద్యాల. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఆపద్భాందవుడు సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు జంధ్యాల.. ఎన్నో ఎన్నెన్నో హస్యప్రధానమైన చిత్రాలను అందించిన జంధ్యాల నవ్వు గురించి ఓ మాట అంటుండేవారు " నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" మని ... ఆయన 2001 జూన్ 19న జంధ్యాల అతి చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించారు. హస్యబ్రహ్మాగా తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు జంధ్యాల.. నేడు జంధ్యాల జయంతి సందర్భంగా అయన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తుంది హెచ్ఎంటీవీ

Krishna

Krishna

Next Story