Preity Zinta: రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రీతి జింటా సమాధానం.. ఇంతకీ ఏమన్నారంటే..!


రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రీతి జింటా సమాధానం.. ఇంతకీ ఏమన్నారంటే..!
నటిగా, వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు ప్రీతి జింటా. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రీతి జింటా తన అభిమానులతో ముచ్చటించారు.
Preity Zinta: సినీ రంగానికి, రాజకీయాలకు అవినాభవ సంబంధం ఉంది. సినీ గ్లామర్తో రాజకీయాల్లో అడుగుపెట్టి రెండు రంగాల్లో రాణించిన వారు అనేకమంది ఉన్నారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ ఇలా సినీరంగంలో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తమ హవా కొనసాగించారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారు. తాజాగా సినీ నటి ప్రీతి జింటా తన రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ప్రీతి ఈ విషయంపై మాట్లాడారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు టికెట్ కూడా ఆఫర్ చేశాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటిగా, వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు ప్రీతి జింటా. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రీతి జింటా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రీతిని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..? అని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్తూ చాలా రాజకీయ పార్టీలు తనకు పార్టీ టికెట్ ఆఫర్ చేశాయని చెప్పారు ప్రీతి. రాజ్యసభకు పంపిస్తామని కూడా ఆఫర్ ఇచ్చారని.. కానీ తాను అంగీకరించలేదన్నారు. రాజకీయాలు తనకు సరిపడవనే ఉద్దేశంతో పాటు ఆసక్తి లేక అటువైపు వెళ్లలేదని వివరించారు.
జవాన్ల కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా నా దృష్టిలో జవానువే అని ప్రశ్నించగా.. సోల్జర్ అని పిలవడం తప్పు కాదు. నేను సైనికుడి కుమార్తెను, సైనికుడి సోదరిని కూడా. మేము ఉత్తర భారతీయులం, దక్షిణ భారతీయులం, బెంగాలీలమో కాదు.. మేము భారతీయులం. దేశభక్తి, జాతీయ గర్వం మా రక్తంలోనే ఉందన్నారు ప్రీతి. మీరు ఎదుర్కొన్న కొన్ని విషయాల కారణంగా రాజకీయాల గురించి ఈ అభిప్రాయం తీసుకున్నారా అని మరో అభిమాని అడగగా.. ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత విషపూరితంగా మారిందని ప్రీతి అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా ఎంత విషపూరితంగా మారిందంటే.. ఎవరు ఏం మాట్లాడినా కూడా దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. ప్రతీ కామెంట్నూ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. తాను సున్నితమైన భావాలు కలిగిన సాధారణ మహిళలను అన్నారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని.. వాటిపై ఆసక్తి లేదన్నారు ప్రీతి.
ఇటీవల ముంబైలోని న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ విషయంలో తలెత్తిన వివాదంపై ప్రీతి స్పందించారు. ఈ బ్యాంకు నుంచి ప్రీతి గతంలో రూ.18 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రీతి తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని.. ప్రతిఫలంగా ఈ లోన్ను బ్యాంకు మాఫీ చేసిందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై ప్రీతి మండిపడ్డారు. తాను ఆ లోన్ను ఎప్పుడో తీర్చేశానని.. తన సోషల్ మీడియా ఖాతాలను తానే నిర్వహిస్తానని వివరణ ఇచ్చారు.
ఈ విషయంలో రాహుల్ గాంధీ పై పరువు నష్టం కేసు దాఖలు చేయాలంటూ మరో అభిమాని సూచించగా.. కేరళ కాంగ్రెస్లో ఎవరో ఒకరు చేసిన పనికి రాహుల్ గాంధీని బాధ్యుడిగా చేయాలనే ఉద్దేశం తనకు లేదని ప్రీతి జవాబిచ్చారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి సమస్యలేదని.. ఆయనపై ఎలాంటి కేసు వేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు ప్రీతి జింటా.
ఇక ప్రీతి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దిల్ సే తో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో షారూఖ్తో కలిసి నటించారు. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



