ఏపీలో భీమ్లా నాయక్‌కు అడ్డంకులు..తెలంగాణలో మంచి వసూళ్లు...

Bheemla Nayak: * సినిమా పదర్శనలకు అడుగడుగునా అడ్డంకులు * ప్రభుత్వంపై ఫైర్ అయిన నిర్మాత ఎన్.వి.ప్రసాద్

Shireesha
Updated on: 26 Feb 2022 8:02 AM IST
Bheemla Nayak Movie Obstacles in AP Heavy Collections in Telangana | Pawan Kalyan
X

ఏపీలో భీమ్లా నాయక్‌కు అడ్డంకులు..తెలంగాణలో మంచి వసూళ్లు...

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా ధియేటర్స్‌లో భారీగా రిలీజ్ అయింది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమా ప్రదర్శనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవ్వటం విమర్శకులకు దారితీస్తొంది.

భీమ్లా నాయక్‌కు తెలంగాణాలో ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎర్లీ మార్నింగ్ 'భీమ్లా నాయక్' షో పడిపోయింది. అలానే టికెట్ ధర పెంపుదలలో వెసులు బాటు ఉండటంతో ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏపీలో 'భీమ్లా నాయక్' కు ఇబ్బందులు తలెత్తాయి.

అదనపు షోలకు అనుమతి లేదని థియేటర్ యాజమాన్యాలను రెవెన్యూ అధికారులు ముందుగానే ఆదేశించారు. జీవో నెంబర్ 35 ప్రకారమే టికెట్ ధరలను వర్తింప చేయాలని నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయితే ఇప్పటికే కరోనా పాండమిక్ వల్ల ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారని.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీరుతో మరింత నష్టపోతున్నామంటూ థియేటర్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో సినిమా ప్రదర్శిస్తే తమకు కనీసం కరెంట్ చార్జీలు కూడా రావంటూ.. 'భీమ్లా నాయక్' ను తమ సినిమా హాళ్లలో ప్రదర్శించలేమంటూ థియేటర్ల గేట్ల వద్ద బోర్డులు పెట్టేశారు.సినిమా టికెట్ ధర ప్రభుత్వ జీవో 35 ప్రకారం ప్రదర్శన గిట్టుబాటు కాదని.. సినిమా ప్రదర్శించడం లేదంటూ విస్సన్నపేటలో యాజమాన్యాలు బోర్డు పెట్టేశాయి.

సినిమా వేయాలని పవన్ ఫ్యాన్స్ రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే మైలవరంలో 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శించే నారాయణ థియేటర్ ను తాత్కాలికంగా మూసివేశారు. చాలా చోట్ల థియేటర్స్ వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. 20, 15, 5 రూపాయలకు టికెట్లు విక్రయించి నష్టపోలేమని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేస్తున్నారు.థియేటర్ గేటు బయట ఇలాంటి నోటీసులు అతికించడంతో సినిమా చూడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

Shireesha

Shireesha

Next Story