ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేసిన పోరాటాలు

Arun Chilukuri
Published on: 25 May 2019 9:27 PM IST
ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేసిన పోరాటాలు
X

వైసీపీ అధికారంలోకి వచ్చినా, ప్రత్యేక హోదాను వదిలిపెట్టేది లేదని, తమ ముందున్న లక్ష్యం స్పెషల్ స్టేటస్సేనంటూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేసిన వైఎస్‌ జగన్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ స్పెషల్ స్టేటస్‌ను సాధించి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన పోరాటాలు ఒకసారి చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత ఐదేళ్లుగా ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారు. ప్రత్యేక హోదా ఇష్యూని అందిపుచ్చుకుని ఇక్కడ చంద్రబాబు తీరును, అక్కడ కేంద్రం మోసాన్ని ఎండగడుతూ పెద్ద యుద్ధమే చేశారు. ప్రత్యేక హోదాపైనే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉందని, హోదా వస్తేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అని, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదంటూ వివిధ రూపాల్లో ఉద్యమించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. పార్లమెంట్‌లో అసెంబ్లీలో పోరాడారు దీక్షలు, ధర్నాలు, బంద్‌లతో ఉద్యమించారు యువభేరిలతో విద్యార్ధులు, యువతలో చైతన్యం తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినా, ప్రత్యేక హోదాను వదిలిపెట్టేది లేదని, తమ ముందున్న లక్ష్యం స్పెషల్ స్టేటస్సేనంటూ జగన్‌ ప్రకటించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేసిన పోరాటాలు

2014 జూన్ నుంచే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పోరాటం ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, 2014 డిసెంబర్ 5న ఫస్ట్‌ టైమ్‌ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు, జగన్ స్వయంగా విశాఖ ధర్నాలో పాల్గొని హోదా కోసం గళం వినిపించారు. అనంతరం 2015 జూన్ 3న మంగళగిరి వేదికగా రెండ్రోజులపాటు జగన్ సమరదీక్ష చేపట్టారు. ఆ తర్వాత 2015 జూన్ 15న కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్‌నాథ్‌ను కలిసి హోదా కోసం జగన్ వినతిపత్రం సమర్పించారు. ఇక 2015 ఆగస్ట్‌ 10న ఢిల్లీలో జగన్ ఒకరోజు ధర్నా చేపట్టారు. ఆ తర్వాత 2015 అక్టోబర్ 7న గుంటూరులో 7రోజులపాటు జగన్ దీక్ష చేశారు. 2016 జనవరి 27న హోదా కోసం కాకినాడలో జగన్‌ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం 2016 మే 10న కాకినాడ కలెక్టరేట్‌ ముందు జగన్ స్వయంగా ధర్నా చేపట్టారు. ఇక 2016 ఆగస్ట్‌ 8న రాష్ట్రపతికి కలిసి జగన్ వినతిప్రతం సమర్పించారు. 2016 సెప్టెంబర్ 10న ఏపీ అసెంబ్లీలో హోదా కోసం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఇక 2017 జనవరి 26న హోదా ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంతో పెనువివాదం చెలరేగింది. ఒకవైపు దీక్షలు, ధర్నాలతో ఉద్యమిస్తూనే, మరోవైపు 2015 నుంచి పాదయాత్ర ప్రారంభానికి ముందువరకు తిరుపతి, విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, విజయనగరం, గుంటూరు, అనంతపురంలో హోదా కోసం యువభేరీలు నిర్వహించి, యువతలో చైతన్యం తీసుకొచ్చారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 20014లో ఒకసారి 2015లో మరోసారి ప్రధాని నరేంద్రమోడీకి వినతిపత్రాలు ఇచ్చిన జగన్‌ చివరికి తన ఎంపీలతో ఏడాదిన్నర ముందే రాజీనామాలు చేయించి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు, వైసీపీ అధికారంలోకి వచ్చినా, ప్రత్యేక హోదాను వదిలిపెట్టేది లేదని, తమ ముందున్న లక్ష్యం స్పెషల్ స్టేటస్సేనంటూ జగన్‌ ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story