గొడ్డేటి మాధవి అరుదైన రికార్డు...లోక్‌సభ చరిత్రలోనే...

Arun Chilukuri
Published on: 25 May 2019 2:36 PM IST
గొడ్డేటి మాధవి అరుదైన రికార్డు...లోక్‌సభ చరిత్రలోనే...
X

17 వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలలో యంగ్ ఎంపీ ఎవరు ? ఆ యంగ్ ఎంపీ ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ? ఏ పార్టీకి చెందిన వారు ?

రాజకీయంగా ఓనమాలు నేర్చుకునే వయసులోనే ఎన్నికల గోదాలో దిగిన గొడ్డేటి మాధవి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అరంగేట్రం చేసి ఉద్ధండుడిపై భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు క్రియేట్‌ చేశారు. కేవలం 25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రతినిధిగా రికార్డుకెక్కారు.

ఇంతకు ముందు ఈ రికార్డు 2014 ఎన్నికల్లో హర్యానా రాష్ట్రం హిసార్‌ లోక్‌సభ స్థానం నుంచి జననాయక్‌ జనతా పార్టీ తరపున గెలుపొందిన దుష్యంత్‌ చౌతాలా పేరున ఉండేది. ఈయన ఎంపీగా గెలిచే సమయానికి వయసు 26 ఏళ్ల 13 రోజులు. గొడ్డేటి మాధవి ఈ రికార్డును చెరిపేశారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. మాధవి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె. విశాఖ జిల్లా అరకు పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. తమలోని ఒకరిగా భావించిన గిరిజనం ఆమెకు భారీ మెజార్టీతో పట్టం కట్టారు.

మాధవిపై తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్‌ పార్లమెంటేరియన్‌, మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ బరిలో నిలిచారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిశోర్‌ కుమార్తె శృతీదేవి బరిలో నిలిచారు. అయితే కిశోర్‌ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న అంశంపై గతంలో వివాదం నెలకొంది. ఆయన క్షత్రియుడన్నది గిరిజనుల ఆరోపణ. ఈ కారణంగానే తమలో ఒకరైన అచ్చమైన గిరిజన యువతిగా మాధవిని ఏజెన్సీ వాసులు ఆదరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు ఏజెన్సీలో వైసీపీ బలంగా ఉండడం కూడా ఆమెకు కలిసి వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story