ట్రంప్, బైడెన్‌ మధ్య హోరాహోరి.. తుది ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

Arun Chilukuri
Published on: 3 Nov 2020 8:11 AM IST
ట్రంప్, బైడెన్‌ మధ్య హోరాహోరి.. తుది ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
X

ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారో తేలే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తోంది. అమెరికా అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అసలు సిసలు సంగ్రామానికి తెరలేపే సమయం ఆసన్నమైంది. ఇవాళ జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది ? అమెరికన్‌ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ఇప్పుడు అందరిలోనూ అదే ఉత్కంఠ.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్‌ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకం. 2016 ఎన్నికల తరహాలో పాపులర్‌ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్‌ రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్‌ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్‌లు స్వింగ్‌ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేశారు. నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆఖరి నిముషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్‌ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్‌ రోజు రాత్రి ట్రంప్‌ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story