పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా యువరైతు

Sericulture: మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్నలూ వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 15 Nov 2021 3:06 PM IST
Siddipet Farmer Yielding Good Profits By Sericulture
X

పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా యువరైతు

Sericulture: మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్నలూ వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులేస్తున్నారు. పంటల సాగులో పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో జీవాలు, చేపలు , పట్టుపురుగు పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో యువకులు సైతం చేస్తున్న ఉద్యోగాలను వీడి ఈ రంగం వైపు కదులుతున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ తనకున్న పొలంలో మల్బరీ తోటలను సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకాన్ని చేపడుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామం ఇప్పుడు మల్బరీ సాగుకు పెట్టింది పేరుగా మారుతోంది. ఇక్కడి రైతులు మల్బరీ తోటల పెంపకం చేపడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తక్కువ సమయంలోనే పొందుతున్నారు. ఇదే కోవలోకి వస్తాడు యువరైతు ప్రవీణ్. ఈ రైతు తనకున్న నాలుగు ఎకరాలలో మల్బరీ తోట సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకం చేస్తున్నాడు.

రెండు ఎకరాల్లో మల్బరీ తోటలను సాగు చేస్తూ సంవత్సరానికి పది పంటలు తీస్తున్నాడు ప్రవీణ్. మూడు నెలలకు ఒకసారి పట్టు ఉత్పత్తిని సాధిస్తున్నాడు. తద్వారా ఎకరానికి మూడు నెలలకు గాను 50 నుంచి 60 వేల వరకు ఆదాయం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. వరి సాగు చేసినా ఎకరానికి 10 వేలు కూడా మిగలడం లేదని వరి కన్నా పది రెట్లు పట్టు సాగే మేలని చెబుతున్నాడు. ఉద్యాన, సెరీకల్చర్ అధికారుల సహకారం, ప్రోత్సాహకాలతోనే పట్టు పురుగుల పెంపకంలో రాణిస్తున్నానంటున్నాడు ప్రవీణ్.

మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకంలో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానం లో ఉందని జిల్లా ఉద్యానాధికారులు తెలిపారు. రైతులు నూతన పద్ధతులను అవలంభిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారన్నారు. తక్కువ పెట్టుబడితో పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి అనతికాలంలోనే అధిక రాబడిని పొందుతూ సిద్ధిపేట జిల్లా రైతులు ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story