మిద్దెతోటలను నిర్వహిస్తున్న నల్గొండకు చెందిన దంపతులు

Arun Chilukuri
Published on: 28 Dec 2020 2:49 PM IST
మిద్దెతోటలను నిర్వహిస్తున్న నల్గొండకు చెందిన దంపతులు
X

రోజు రోజుకు కాలుష్యం పెరుగుతున్న కాలంలో ప్రతీ రోజు కాస్త సమయాన్ని వారు ప్రకృతితో గడుపుతున్నారు. పచ్చని మిద్దె తోటను నిర్వహిస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు. వ్యవసాయ కుటుంబ నేపథ్యాన్ని ఎక్కడా మర్చిపోకుండా సేంద్రియ మిద్దె తోటలు నిర్వహణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శంకర్ రెడ్డి, పుష్పా దంపతుల మిద్దెతోట విశేషాలు మీకోసం.

నల్గొండలో నివాసం ఉంటున్న శంకర్ రెడ్డి, పుష్పా, దంపతులు నాలుగేళ్లుగా మిద్దెతోటను నిర్వహిస్తున్నారు. మొదట గ్రోబ్యాగ్స్ లో తక్కువ ఖర్చుతో ఆకుకూరలు, కూరగాయల సాగు ప్రారంభించారు. క్రమేనా పండ్ల మొక్కల, ఔషధ మొక్కలను పెంపకం మొదలు పెట్టారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలు ఇలా అన్ని రకాల మొక్కలు ఇంట్లోనే స్వయంగా పెంచుకోవడం గొప్ప అనుభూతని అంటున్నారు పుష్ప .

నాలుగేళ్ల క్రితం మొదటిసారి తుమ్మేటి రఘోత్తమరెడ్డిగారి మిద్దె తోటని చూసి స్పూర్తి పొందామని అంటున్నారు నిర్వాహకుడు శంకర్ రెడ్డి. మిద్దె తోటలను నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని, శ్రమతో పెట్టుబడితో మిద్దె తోటలను సాగు చేసినా ఆతరువాత మొక్కలు అందించే ఫలితాలు మనిషికి ఎంతో సంతోషాన్ని అందిస్తాయని అంటున్నారు.

మిద్దె తోటలో కేవలం ఆకు కూరలు, కాయగూరలను మాత్రమే సాగు చేయకుండా వాటితో పాటు చాల అరుదుగా వుండే పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. తమ కుటుంబానికి కావలసిన కూరగాయలు, పండ్ల, ఔషద మొక్కలను సాగు చేసుకోవటం తమకు చాల సంత్రృప్తికరంగా వుంటుందని అంటున్నారు. ప్రత్యేక వాతవరణ పరిస్థితుల్లో పెరిగే డ్రాగన్ ప్రూట్ , అవకాడో, పొద్దుతిరుగుడు పూలూ వంటివి కూడ వీరి మిద్దె తోటలో పెంచుతున్నారు.

మొక్కకు పోషకాలను అందించే మట్టి ఎంపిక చాల అవసరం ఇందు కోసం తోటలో రాలిపోయిన ఆకులను చెట్ల వ్యర్ధాలను మట్టిగా మార్చుకొని తిరిగి కుండీల్లో అదే మట్టిని వాడుకోవటం వల్ల మొక్కలకు మంచి పోషకాలు అందుతాయని అంటున్నారు శంకర్ రెడ్డి. అంతే కాకుండా మొక్కలో ఎదుగుదలకు, చీడపీడలకు సేంద్రియ ద్రావణాలను వాడుతామని అంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story