విజయనగరం జిల్లాలో అన్నదాతపై వరుణుడి కన్నెర్ర

Arun Chilukuri
Published on: 18 Sept 2020 1:04 PM IST
విజయనగరం జిల్లాలో అన్నదాతపై వరుణుడి కన్నెర్ర
X

మేఘాలు మొహం చాటేసాయి చినుకు జాడే కానరావట్లేదు ఎండుతున్న పంటలు వర్షాల కోసం రైతున్నల ఎదురుచూపులు. గత నలభై సంవత్సరాలలో ఎన్నడూ లేనివిధంగా ఆ జిల్లాపై నేడు వర్షాలు కన్నెర్రజేసాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడ్డారు విజయనగరం జిల్లా రైతులు. జిల్లా రైతుల దు:స్థితిపై ప్రత్యేక కథనం.

విజయనగరం జిల్లా తీవ్ర వర్షాబావంతో అల్లాడుతోంది. రాష్ట్రంలోని పలుచోట్ల వరదలు ముంచేత్తుతుంటే విజయనగరం జిల్లాలో వర్షాలు లేక రైతన్నలు అల్లాడుతున్నారు. ఖరీఫ్ పై కోటి ఆశలతో మొదలు పెట్టిన రైతన్నకు వరుణుడు దోబూచులాడుతూ ఊరిస్తున్నాడు. వానలు లేక తొలకరి పంటల కోసం పెట్టిన పెట్టుబడి నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకోన్నాయి. ఖరీఫ్‌కు తోలినాళ్ళలోనే తొలకరి చినుకులు పలకరించడంతో రైతన్నలు కోటి ఆశలతో పంటలను సాగుకు సిద్ధపడి దుక్కలు చేసి విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షం జాడ లేకుండా పోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి.

అప్పులుచేసి పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే వర్షం లేక పెట్టుబడి, కూలీల ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు కనబడక ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మూడేళ్లుగా జిల్లాలో ఏదో రకంగా రైతులు నష్టపోతుండటంతో పల్లెల్లో కరువుఛాయలు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా జిల్లా మొత్తం కరువు రక్కసితో అల్లాడుతోంది. సరైన వర్షాలు లేక వాగులు, వంకలు ఎండిపోయాయి. జలాశయాల్లో నీరులేక సాగునీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కరువు పరిస్థితులు ఎదుర్కొంటోన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు రైతులు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story