రసాయన రహిత సేద్యంలో రాణిస్తున్న జగిత్యాల జిల్లా రైతు

Farmer Ram Reddy Natural Farming Tips
x

రసాయన రహిత సేద్యంలో రాణిస్తున్న జగిత్యాల జిల్లా రైతు

Highlights

Farmer Ram Reddy: వ్యవసాయంలో అధిక దిగుబడుల ఆశతో రైతులు మోతాదుకు మించి రసాయనాలు, పురుగుమందులను వినియోగిస్తున్నారు.

Farmer Ram Reddy: వ్యవసాయంలో అధిక దిగుబడుల ఆశతో రైతులు మోతాదుకు మించి రసాయనాలు, పురుగుమందులను వినియోగిస్తున్నారు. తద్వారా సాగులో పెట్టుబడులు రెట్టింపు అవుతున్నాయి. భూమి నిస్సారంగా మారుతోంది. ఏటేటా దిగుబడులు తగ్గుతున్నాయి, పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు చేరిపోతున్నాయి. వినియోగదారిపైనే కాదు సాగుదారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉండటంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు మెక్కొండ రాంరెడ్డి. గత 8 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ప్రయోగాత్మకంగా రెండేళ‌్లుగా రసాయన రహిత సేద్యం చేస్తున్నారు. మార్కెట్‌పై ఆధారపడకుండా సొంతంగా పంటలను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాంరెడ్డికి ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, మామిడి వంటి పంటలను పండిస్తున్నారు. ఈ ఏడు ప్రయోగాత్మకంగా పూర్తి ప్రకృతి విధానాలను అనుసరిస్తూ 20 గుంటల్లో పుచ్చ, తర్బూజ, కూరగాయ పంటలైన దోస, బీర, కాకర సాగు చేస్తున్నారు.

మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాడు. దోమలను నివారించేందుకు పొలంలో పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకున్నాడు. పురుగులను ఆకర్షించేందుకు ట్రాపర్లను అమర్చారు. కేవలం పశువుల వ్యర్థాలతోనే పంటలు సాగు చేస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు. అధిక దిగుబడులు ఆర్జించాలనే ఉద్దేశం తనకు లేదని ప్రకృతి సేద్యంలో కొద్ది మొత్తంలో నాణ్యమైన దిగుబడులు అందినా చాలని రైతు తెలిపారు.

వరిలో ఎప్పుడూ సాగు చేసే సాధారణ రకాలు కాకుండా ఈ ఏడు బాస్మతిని విత్తనాల నిమిత్తం 20 గుంటల్లో పండిస్తున్నారు రాంరెడ్డి. లాభదాయకమైన ఆదాయం పొందాలనే ఉద్దేశంతోనే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పూసా బాస్మతి వరి రకాన్ని పండిస్తున్నానంటున్నారు ఈ సాగుదారు. ఇప్పటి వరకు సాగులో ఎలాంటి రసాయనాలు వాడలేనని రాంరెడ్డి తెలిపారు. రానున్న వర్షాకాలంలో 4 ఎకరాల్లో సాగును విస్తరించి తోటి రైతులకు విత్తనాన్ని అందిస్తానని చెబుతున్నారు.

రాంరెడ్డి పొలానికి దగ్గరగా అటవీ ప్రాంతం ఉంది. దీంతో అడవి జంతువులు, కోతుల బెడద అధికంగా ఉంటుంది. అందుకే ఆ చుట్టుపక్కన ప్రాంతాల్లో ఉండే రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు సాహసించరు. కానీ రాంరెడ్డి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో తన పొలానికి రక్షణ కల్పిస్తున్నారు. 10 వేల రూపాయలు ఖర్చు చేసి పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. దేశానికి అన్నం అందించాలంటే అన్నదాత బాగుండాలి అంటున్నారు ఈ సాగుదారు..ఆ ఉద్దేశంతోనే తమ ఇంటి అవసరాల కోసం బీర, కాకర, టమాట సాగు చేస్తున్నారు ఈ రైతు. ట్రెల్లీస్ విధానంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా వీటిని పండించుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories