రెండేళ్లు రూపాయి ఆదాయం లేదు.. కానీ ఇప్పుడు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నాడు

Bhimavaram Jathi Kollu: నిరుధ్యోగుల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న ఉద్యోగాన్ని సైతం వీడి వ్యవసాయ అనుబంధ..

Arun Chilukuri
Published on: 30 Oct 2021 4:06 PM IST
Bhimavaram Jathi Kollu Farming By Harsha
X

రెండేళ్లు రూపాయి ఆదాయం లేదు.. కానీ ఇప్పుడు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నాడు

Bhimavaram Jathi Kollu: నిరుధ్యోగుల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న ఉద్యోగాన్ని సైతం వీడి వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులు వేశారు శ్రీకాకుళం జిల్లా కాజీపేటకు చెందిన హర్ష. తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో జాతికోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టారు. అవగాహన లోపం, ఆదాయం లేకపోవడంతో రెండేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా పట్టువదలకుండా తన ప్రయత్నం తాను చేసుకుంటూ వచ్చారు. లోపం ఎక్కడుంది.? ఏం చేస్తే విజయం వరిస్తుందో సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. తన పొరపాట్లను గుర్తించి ప్రస్తుతం లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు హర్ష.

గత ఆరేళ్లుగా భీమవరం జాతికోళ్లను పెంచుతున్నారు హర్ష. 200 కోళ్లతో పెంపకం మొదలు పెట్టి ప్రస్తుతం రెండు ఫారాలను ఎర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఫారంలో 600 కోళ్లు వరకు పెంచుతున్నారు. సేతువ, డేగ, కక్కెర, పచ్చకాకి, కాకి, నెమలి, రసంగి, అబ్రాస్, సవలా, పింగల వంటి ఎన్నో రంగుల భీమవరం భ్రీడ్ కోళ‌్లు ఈ ఫారంలో మనకు కనిపిస్తాయి. వీటి నుంచి ఉత్పత్తి అయిన నాణ్యమైన చిక్స్‌ను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ ప్రతి నెల లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే చాలా మంది నాటుకోళ్ల పెంపకంవైపు వస్తున్నా సరైన బ్రీడ్ సెలక్షన్‌ లేక నష్టపోతున్నారని రైతు వివరిస్తున్నారు. ఊరు కోళ్లను పెంచడం వల్ల లాభదాయకమైన ఆదాయం రైతులకు అందదని జాతి కోళ్లు పెంచితేనే ఈ రంగంలో రాణించగలరని చెబుతున్నారు ఈ యువరైతు.

ఈ రంగంవైపు రావాలనుకునే వారికి కోడి పిల్లల ఎంపిక నుంచి వాటిలోని రకాలను వివరిస్తూ ఏ ఏ రకాలకు మార్కేట్ ఉంది, ఏ ఏ రకాలు మాంసానికి ఉపయోగించాలి వంటి సలహాలను, సూచనలను అందిస్తున్నారు. తాను ఎంపిక చేసుకున్న బ్రీడ్‌లకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉందంటున్నారు ఈ పెంపకందారు. తనవద్ద నుంచి పిల్లలను తీసుకెళ్లిన తరువాతా వరితో ఇక పనిలేదులే అని అనుకోకుండా పెంపకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి అండగా ఉంటూ అవగాహన కల్పిస్తున్నారు.

కోళ్ల ఫామ్ పెట్టాలనే ఆసక్తి ఉన్నవారు పెద్ద మొత్తంలో ప్రారంభించకుండా మొదట వంద పిల్లలతో పెంపకం మొదలు పెట్టాలని ఈ యువరైతు సూచిస్తున్నారు. ప్రధానంగా వీటి పెంపకం ద్వారా ఆదాయం వస్తుందో రాదో తెలుసుకోవాలన్నారు. మార్కెటింగ్ అవకాశాలు తెలుసుకున్నాకే మెల్లమెల్లగా కోళ్ల సంఖ్యను పెంచుతూరావాలంటున్నారు.

సరైన మెళకువలు, వ్యాక్సిన్‌లు అందించే విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కోళ‌్ల పెంపకంలో సత్ఫలితాలు సాధించవచ్చంటున్నారు ఈ పెంపకందారు. ఫ్రీరేంజ్‌లో కోళ్లను పెంచే వారు 10 పెట్టలకు ఒక పుంజు ఉండేలా చూసుకోవాలని, షెడ్డుల్లో పెంచుతున్నట్లైతు 7 పెట్టలకు ఒక పుంజును పెంచుకోవాలని చెబుతున్నారు. ఇలా పెట్టలకు తగ్గట్లుగా పుంజులను పెట్టుకోవడం వల్ల గుడ్ల ఉత్పత్తి అధికంగా ఉంటుందంటున్నారు. ఇక కోళ‌్లకు అందించే వ్యాక్సిన్ల పట్ల పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నాటుకోళ్లకు మేతగా అందించే ధాన్యం, గంట్లు, సజ్జలు, వడ్లనే వీటికి అందిస్తే సరిపోతుందని తెలిపారు. పుంజులకు మాత్రం బలవర్దకమైన మేతను అందించాలంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story