రాధా దారెటు?

arun
By arun
Updated on: 24 Dec 2018 12:46 PM IST
రాధా దారెటు?
X

విజయవాడ వైసీపిలో కలకలం రేగింది. పార్టీ నేత వంగవీటి రాధా మరోసారి పార్టీ అదినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న రాధా.. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. దీనికితోడు పార్టీ నుండి సస్పెండైన గౌతంరెడ్డి జగన్ ను కలవడంతో రాధా అసంతృప్తి తారా స్థాయికి చేరింది. పార్టీ నుండి సస్పెండ్ చేసిన వారిని కలవడమేంటంటూ మండిపడుతున్నారు రాధా.

విజయవాడ వైసీపీలో చిచ్చు రేగింది. సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి వంగవీటి రాధా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదనకు గురవుతున్నారు. తనకు వైసీపీలో అన్యాయం జరుగుతోందని అనుచరుల వద్ద వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాధా పార్టీ మారబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. దీనిపై రాధా పెదవి విప్పలేదు. వైసీపీ హైకమాండ్‌ వద్ద తన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని అసంతృప్తితో ఉన్నారు.

ఇటీవలే వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన వైసీపీ నేత గౌతంరెడ్డి జగన్‌ను సంకల్పయాత్రలో కలవడం సంచలనంగా మారింది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ సీటుపై అటు వంగవీటి రాధా, ఇటు మల్లాది విష్ణు పోటి పడుతున్నారు. పార్టీ నుండి సస్పెండ్ అయినా సెంట్రల్ వైసీపీ నేత గౌతంరెడ్డి జగన్ ను పాదయాత్రలో కలవడంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో విజయవాడ వైసీపీలో ఏదో జరగబోతుందనేది కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.

అటుఇటుని పరిస్థితిలో ఉన్న రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి.. పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అలా కాకుండా జనసేనలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాధా పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు పొలిటికల్‌ టాక్‌. పైగా వాక్‌ విత్‌ జగన్‌ కార్యక్రమానికి కూడా రాధా దూరంగా ఉండడంతో వైసీపీకి రాధా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితులంటున్నారు.

arun

arun

Next Story