మద్దతు ధర ఎలా నిర్ణయిస్తారు ?

x
Highlights

రైతులను ఆదుకోవడానికి ఎంఎస్‌పీ పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాగు వ్యయానికి 50శాతం అదనంగా కలిపి మద్దతు ధర ఇవ్వనున్నట్లు బడ్జెట్‌ స్పీచ్‌లో జైట్లీ...

రైతులను ఆదుకోవడానికి ఎంఎస్‌పీ పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాగు వ్యయానికి 50శాతం అదనంగా కలిపి మద్దతు ధర ఇవ్వనున్నట్లు బడ్జెట్‌ స్పీచ్‌లో జైట్లీ తెలిపారు. అయితే సాగు వ్యయాన్ని ఎలా లెక్కిస్తారు? కనీస మద్దతు ధరను ఎలా లెక్కిస్తారు? ఏఏ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది?

అన్నదాతలను ఆదుకోవడానికి కనీస మద్దతు ధరలు ఎంఎస్‌పీ పెంచనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండబోతుందోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే సాగు వ్యయాన్ని ఎలా లెక్కిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే 26 పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఛైర్మన్‌గా కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల అర్థగణాంక శాఖల ద్వారా సాగు వివరాలు తీసుకుని, క్షేత్రస్థాయి అంశాలను సాగుదారుల నుంచి సేకరిస్తుంది. ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో సాగు వ్యయం, భూమి ధరలు ఇలా అన్నింటి ఆధారంగా పంటల వారీగా క్వింటాకు ఎంత ధర నిర్ణయించాలో కోరతాయి. అన్ని రాష్ట్రాల వివరాలు తీసుకోవడంతోపాటు తాము సేకరించిన వివరాల ఆధారంగా కమిటీ కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తుంది. దీని ఆధారంగా కేబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీ మొత్తం 11 అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది. ఇందులో ఉత్పత్తి వ్యయం, డిమాండ్‌-సప్లై, మార్కెట్‌పై ధరల ప్రభావం, అంతర్జాతీయంగా ధరల పరిస్థితి ఇలా అనేక అంశాల ఆధారంగా ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

మొదట పంటల సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో కూలీలు, ఎద్దులు, యంత్రాల వినియోగం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సత్తువ, నీటి తీరువాలను లెక్కలోకి తీసుకుంటారు. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని తీసుకొని కమిటీ ఓ నిర్ణయానికి వస్తుంది. దీనినే వాస్తవ వ్యయంగా పరిగణిస్తారు. సాగుదారు సొంతంగా భూమిలో పని చేస్తారు. ఈ శ్రమను కనీస మద్దతు ధర నిర్ణయ సమయంలో పరిగణనలోకి తీసుకోవడాన్ని ఎఫ్‌2గా పేర్కొంటున్నారు. భూమి సాగుకు చెల్లించే మొత్తం, సొంతంగా పెట్టిన పెట్టుబడికి వడ్డీని పరిగణనలోకి తీసుకోవడాన్ని సీ2గా పరిగణిస్తున్నారు. ఈ మూడింటిని కలిపి కనీస మద్దతు ధరగా నిర్ణయించడంతోపాటు, దీనిపై 50శాతం అదనంగా చెల్లిస్తేనే వ్యవసాయం లాభదాయకం అవుతుందని జాతీయ రైతు సంక్షేమ కమిషన్‌ సిఫార్సు చేసింది. అయితే ప్రస్తుతం వాస్తవ వ్యయం, కుటుంబ శ్రమను లెక్కలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయిస్తున్నారు.

ఇప్పటివరకు సాగుకయ్యే వ్యయాన్ని లెక్కగట్టిన పద్ధతినే కొనసాగిస్తే 50శాతం అదనంగా ఇచ్చినా ప్రయోజనం నామమాత్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని, మార్పులు చేయాలనే అభిప్రాయమూ ఉంది. మరి కేంద్రం ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories