రూ.900కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ అరెస్ట్

రూ.900కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ అరెస్ట్
x
Highlights

బిహార్‌లో రెండు దశాబ్దాల క్రితం వెలుగుచూసిన దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో నిందితులైన...

బిహార్‌లో రెండు దశాబ్దాల క్రితం వెలుగుచూసిన దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో నిందితులైన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో పాటు మరో 15 మందిని దోషులుగా తేల్చింది. అలాగే, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా సహా మరో ఐదుగర్ని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు జనవరి 3న న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది.
1991 నుంచి 1994 మధ్య జరిగిన ఈ కుంభకోణం 1997లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పశువుల దాణా పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సహా మరికొందరిపై కేసు నమోదైంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తన భార్య రబ్రీ దేవిని సీఎంను చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
ఇందులో ఒకటైన చైబాసా కోశాగార కేసులో ఇప్పటికే లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. ఆ సమయంలో రెండున్నర నెలల పాటు జైల్లో ఉన్న లాలూ.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
తాజాగా వచ్చిన తీర్పు దేవగఢ్‌ కోశాగార కేసుకు సంబంధించింది. 1991 నుంచి 1994 మధ్య ఈ ఖజానా నుంచి రూ.89లక్షలు పశుదాణా పేరుతో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో 38 మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. విచారణ సమయంలో వీరిలో 11 మంది మృతిచెందగా, మరో ముగ్గురు అప్రూవర్‌గా మారారు. ఇంకో ఇద్దరు నేరాన్ని అంగీకరించడంతో 2006లో వారికి శిక్ష విధించారు.
తాజాగా మిగిలిన 22 మందిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూ సహా 15 మందిని దోషులుగా తేల్చింది. దీంతో సీబీఐ అధికారులు లాలూను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం లాలూను రాంచీ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వియాదవ్‌ కూడా న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. ఈ కేసు తీర్పులో ఉత్కంఠత నెలకొనడంతో ఆయన మద్దతుదారులు, భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో పోలీసులు కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories