ఉద్దానానికి ఊపిరిపోస్తా... సిక్కోలులో పవన్‌

santosh
Updated on: 24 Dec 2018 1:33 PM IST
ఉద్దానానికి ఊపిరిపోస్తా... సిక్కోలులో పవన్‌
X

శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, బీజేపీ, టీడీపీ, వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ..ప్రజలకు హామీలు ఇస్తూ పవన్ టూర్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పవన్ ఇవాళ పాలకొండ, రాజాం, రణస్థలం‌లో పర్యటిస్తారు.

రెండు రోజుల విరామం తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పవన్ తన యాత్రను పదునైన విమర్శలతో మొదలు పెట్టారు. ఆదివారం వంశధార నిర్వాసిత గ్రామాలను సందర్శించి పరిహరం పంపిణీలో జరిగిన అవకతవకల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హమీ ఇచ్చారు. తర్వాత వంశధార రిజర్వాయర్ పనులను పవన్ పరిశీలించారు.

ఆదివారం మధ్యాహ్నం నుంచి పవన్.. నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలసలలో పర్యటించారు. భయపడేవాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు ఏ న్యాయం జరుగుతుందని ఆముదాలవలస సభలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ విషయంలో మోడీ సర్కారు నాలుగేళ్లలో 36 సార్లు మాటలు మార్చిందని ధ్వజమెత్తారు. హామీలు నెరవేర్చకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మోడీకి జనసేన అధినేత వార్నింగ్ ఇచ్చారు.

పలాసలో తానున్న గెస్ట్‌ హౌస్‌లో కరెంట్‌ తీయించి జనసేన కార్యకర్తల పేరు చెప్పి తనపై దాడి చేయించారని పవన్ ఆరోపించారు. జనసేన వల్ల పదవులు అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు జన సైనికులను వేధిస్తున్నారని మండిపడ్డారు. అయితే తాము చేతులు కట్టుకొని కూర్చోబోమన్నారు. రాబోయేది జనసేన కాలమని, ఆ విషయం మర్చిపోవద్దని టీడీపీ నేతల్ని పవన్ హెచ్చరించారు.

santosh

santosh

Next Story