చరణ్ కి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ ఎక్కువగా ఉండేది  -మెగాబ్రదర్ నాగబాబు 

చరణ్ కి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ ఎక్కువగా ఉండేది  -మెగాబ్రదర్ నాగబాబు 
x
Highlights

"ఆరెంజ్" సినిమా ఫ్లాపైన తర్వాత ఒక ఫిలిమ్ మేకర్ గా నేను అన్ ఫిట్ అనిపించింది. అందుకే ఆ తర్వాత సినిమా నిర్మాణానికి చాలా దూరంగా ఉంటూ.. సీరియల్స్,...


"ఆరెంజ్" సినిమా ఫ్లాపైన తర్వాత ఒక ఫిలిమ్ మేకర్ గా నేను అన్ ఫిట్ అనిపించింది. అందుకే ఆ తర్వాత సినిమా నిర్మాణానికి చాలా దూరంగా ఉంటూ.. సీరియల్స్, స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు నన్ను మళ్ళీ నిర్మాతగా మారమని ఈ ప్రొజెక్ట్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. ఒక సమర్పకుడిగా కేవలం ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించానే తప్ప కథ, దర్శకుడు అనేవి అన్నీ వాళ్ళే సెలక్ట్ చేసుకొన్నారు" అంటూ దాదాపు పదేళ్ళ తర్వాత నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్న నాగబాబు తన మనసులోని భావాలను, "నా పేరు సూర్య" విశేషాలను, తన పర్సనల్ & ప్రొఫెషనల్ లైఫ్ మేటర్స్ ని మీడియాతో షేర్ చేసుకొన్నారు. ఆయన గొంతు సరిగా లేకపోవడం వల్ల ఇంటర్వ్యూ మొత్తం మూకీ డ్రామా తరహాలో సాగినప్పటికీ.. ఓపిగ్గా 40 నిమిషాల పాటు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు.

బాధ ఎక్కువగా ఉండేది..
"ఆరెంజ్" సినిమా ఫ్లాప్ అయ్యింది, లాస్ వచ్చింది అనే బాధకంటే ఎక్కువగా "మగధీర" లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ కి మంచి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ ఎక్కువగా ఉండేది. నేను ఒక నిర్మాతగా పనికిరానేమోనని బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. అందుకే సినిమాలకు దూరంగా సీరియల్స్ చేసుకుంటూ ఉండిపోయాను. తర్వాత "జబర్దస్త్"తో నా కెరీర్ లో ఊహించని మార్పులొచ్చాయి.

అల్లు వారి ప్రేరణతో..
ఒక మూడేళ్ళ క్రితం అల్లు అరవింద్ నా దగ్గరకి వచ్చి "నువ్ మళ్ళీ నిర్మాతగా సినిమా తీయాలి" అని చెప్పారు. అయితే.. నాకు భయం, మళ్ళీ అవసరమా అని. కానీ.. అల్లు అర్జున్ నా దగ్గరకి వచ్చి "ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది" అని చెప్పడంతో మళ్ళీ నిర్మాతగా మారే ఆలోచన నా మెదడులోకి వచ్చింది. అప్పుడు లగడపాటి శ్రీధర్ ని పార్టనర్ గా చేసుకొని "నా పేరు సూర్య" నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. అయితే.. కథ, దర్శకుడు అన్నీ అల్లు అర్జున్ అప్పటికే సెట్ చేసుకొని ఉండడంతో మాకు పెద్దగా పని లేకుండా పోయింది. అయితే.. ఈ సినిమా నిర్మాణ సమయంలో వీళ్ళిచ్చిన ఉత్సాహంతో భవిష్యత్ లో మళ్ళీ సినిమాలు రూపొందించాలన్న ఆలోచన మాత్రం వచ్చింది.

అంతా బన్నీ వాసు చూసుకున్నాడు..
నిజానికి నిర్మాతలంటే రోజూ సెట్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అందునా పెద్ద హీరోల సినిమాలంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంటాయి. నేను అప్పుడప్పుడూ సెట్ కి వెళ్లానే తప్ప ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతా మా బన్నీ వాసు దగ్గరుండి చూసుకున్నాడు. సినిమాలో ఎలాంటి ఆర్టిస్ట్ కావాలి అనే దగ్గరనుంచి అన్నీ తానే చూసుకున్నాడు.

ప్రస్తుతానికి అంతా బాగుంది..
నేను దాదాపు పదేళ్ళ తర్వాత నిర్మాతగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాను, మా అబ్బాయి హీరోగా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మా అమ్మాయి మంచి పాత్రలు చేస్తూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకొంటోంది. "జబర్దస్త్" షో జడ్జ్ గా నేను కూడా బిజీగా ఉన్నాను. నా కెరీర్ లో ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకొంటున్నాను.

వరుణ్ తో సినిమా నిర్మించడం, నటించడం ఇంకా ప్లాన్ చేయలేదు..
నా ఇంట్లోనే ఒక సక్సెస్ ఫుల్ హీరో ఉన్నాడు కాబట్టి అతనితో ఒక సినిమా తీయొచ్చు కదా అని అందరూ చెబుతున్నారు. అయితే.. వరుణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాడు హీరోగా కొత్త కథలను ఎక్స్ ప్లోర్ చేస్తున్నాడు. వాడు బయట నిర్మాతలకు అందుబాటులో ఉండాలనే కోరుకొంటాను కానీ.. నేను క్యాష్ చేసుకోవాలన్న ఆశ ఎప్పుడూ లేదు. భవిష్యత్ లో ఏదైనా సినిమా ప్లాన్ చేయొచ్చేమో కానీ.. ఇప్పుడైతే అలాంటి ఆలోచనేమీ లేదు. అలాగే.. వాడితో కలిసి నటించే విషయంలోనూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫ్యూచర్ లో ఏదైనా మంచి సబ్జెక్ట్ వచ్చే చేస్తానేమో.

చూడకుండానే బాలేదని టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు..
కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా "నా పేరు సూర్య" సినిమా బాలేదంట, అవుట్ పుట్ బాగా రాలేదంట అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఆ విషయంలోనే నేను, అల్లు అరవింద్ చాలా బాధపడ్డాము. సినిమా రిలీజ్ అయ్యాక బాగుంది, లేదు అని డిసైడ్ చేయొచ్చు కానీ.. రిలీజ్ కి ముందే బాగోలేదని ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి. ఆ విషయంలో మాత్రం చాలా హార్ట్ అయ్యాం.

వక్కంతం వంశీ హీరోగా చేసినప్పట్నుంచి తెలుసు..
చాలామందికి వంశీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడని తెలియదు. కానీ.. నాకు అతను హీరోగా దాసరి గారి దర్శకత్వంలో చేసినప్పట్నుంచి తెలుసు. అతను అద్భుతమైన రచయిత. ఎలాంటి కథలోనైనా ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేయగల సమర్ధుడు. "నా పేరు సూర్య" సినిమాతో దర్శకుడిగా అందర్నీ ఆకట్టుకోవడమే కాదు ఆశ్చర్యపరచడం కూడా ఖాయం. వంశీ నెక్స్ట్ ఫిలిమ్ కూడా మా కాంపౌండ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.

బన్నీ క్యారెక్టరైజేషన్ హైలైట్ గా నిలుస్తుంది..
సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. "క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాకముందు చచ్చిపోవడమే" అనే డైలాగ్ ఉంటుంది. బన్నీ క్యారెక్టర్ నిబద్ధతతో ఉంటుంది. అలాగని సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుందని అనుకోకండి, బన్నీ సీరియస్ నెస్ వల్లే కామెడీ కూడా క్రియేట్ అవుతుంది.

బాహుబలి తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచింది..
"బాహుబలి" విడుదలైన తర్వాత తెలుగు సినిమా స్థాయి, మార్కెట్ పెరిగింది. నేను నిర్మాతగా పదేళ్ళ క్రితం చూసిన ఇండస్ట్రీకి, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా వేరే భాషల్లో మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుండడం వల్ల మొదటి రెండు వారాల్లోనే నిర్మాత ఇన్వెస్ట్ మెంట్ లో 80% పైగా రిటర్స్ వచ్చేస్తున్నాయి. నిజానికి ఇది మంచి విషయమే.

ప్రపంచస్థాయి సినిమాలకు పోటీగా ఉండాలి..
ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ కి వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఆ స్టాండర్డ్స్ ని మన తెలుగు లేదా ప్రాంతీయ సినిమాల్లోనూ ఆ క్వాలిటీ ఉండాలని కోరుకొంటున్నాడు. అందులో తప్పేమీ లేదు, అందుకే మేం కూడా సినిమాల విషయంలో ఖర్చుకి వెనుకాడడం లేదు. ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇవ్వాలన్నదే మా తపన.

భవిష్యత్ లో పదికోట్ల లోపు బడ్జెట్ సినిమాలుండవు..
ఇప్పుడు ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్, డిజిటల్ మీడియా కారణంగా ఆడియన్స్ ను ఆప్షన్స్ బోలెడు ఎవైలబుల్ లో ఉంటున్నాయి. అందువల్ల క్వాలిటీ ఉన్న కంటెంట్ ను మాత్రమే ఆదరిస్తున్నారు. భవిష్యత్ లో.. పదికోట్ల లోపు బడ్జెట్ లో తీసే సినిమాలకు థియేటర్ రిలీజ్ ఉండకపోవచ్చు.. ఆన్ లైన్ లోనే పే పర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తారేమో.

దాని వల్ల పెద్ద లాస్ లేదు..
సినిమా రిలీజైన మూడు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ అయిన అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ చేయడం వలన పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. అందుకు కారణం అప్పటికే సినిమా ఆల్రెడీ మాగ్జిమమ్ ఆడియన్స్ చూసేసి ఉంటారు. అయినా ప్రస్తుతం సినిమాలకి మూడు వారాలకు మించిన లైఫ్ ఉంటుందా. అందువల్ల ఆన్ లైన్ రిలీజ్ వల్ల పెద్ద లాస్ ఏమీ లేదు.

ఆరెంజ్ ఇప్పుడు రిలీజైతే హిట్ అయ్యేదేమో..
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. అందువల్ల అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఒకవేళ "ఆరెంజ్" గనుక ఈ టైమ్ లో రిలీజ్ అయ్యి ఉంటే హిట్ అయ్యేదేమోనని. కానీ.. ఇప్పుడైతే ఏమీ చేయలేం కదా.

హీరోలు కలిసుంటేనే.. పరిశ్రమ బలంగా ఉంటుంది.
ఈమధ్య ఎన్టీయార్, మహేష్ బాబు, రామ్ చరణ్ లు కలిసి పార్టీస్ కి వెళ్ళడం ఫోటోలు దిగడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాళ్ళందరూ కలిసుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అందువల్ల ఈ పరిణామం పరిశ్రమకి మంచిదనే చెప్పాలి.

అసలు న్యూస్ చానల్స్ బ్యాన్ అనే ఆలోచనే లేదు..
ఏదో ఎవరో అన్నారని కొందరు కంగారుపడుతున్నారు కానీ.. అసలు ఇప్పటివరకూ న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. కేవలం ఇండస్ట్రీ మంచి కోసం ఏం చేయాలి అనేది మాత్రమే మేం చర్చించుకొన్నాం.

ఫ్యాన్స్ ను మేం కంట్రోల్ చేయలేం..
పవన్ కళ్యాణ్ కానీ నేను కానీ ఎప్పటికప్పుడు "అనవసరమైన విషయాల మీద రియాక్ట్ అవ్వకండి అని చెబుతూనే ఉంటాం". అయితే.. ఎవరో ఒకరు పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లు వాగి.. మళ్ళీ మాకే "మీ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయండి" అని మాకు సలహాలు ఇవ్వడం అనేది ఎంతవరకూ సమంజసం అనేది వాళ్ళకే తెలియాలి. అయినా.. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా "మీరు రియాక్ట్ అవ్వకండి అని చెప్పలేం కదా".

ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమాలో చిన్న క్యారెక్టర్..
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఒక స్పేషల్ రోల్ ప్లే చేస్తున్నాను. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాది సినిమా ప్రారంభంలో వచ్చే పాత్ర. అలాగే.. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ ఫిలిమ్ లోనూ నటిస్తున్నాను.

Show Full Article
Print Article
Next Story
More Stories