'మ్యూజిక్ మేస్ట్రో' ఇళయ రాజాకు 'పద్మ విభూషణ్'

arun
By arun
Updated on: 24 Dec 2018 12:44 PM IST
మ్యూజిక్ మేస్ట్రో ఇళయ రాజాకు పద్మ విభూషణ్
X

గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, కంపోజర్, గాయకుడు, వాయిద్యకారుడు అయిన ఇళయరాజాకు పద్మ విభూషణ్ లభించింది. ఇళయరాజాకు 2010లో పద్మభూషణ్ పురస్కారం కూడా దక్కింది.

రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టే అద్భుత ప్రతిభ మ్యూజిక్ మ్యాస్ట్రో.. ఇళయరాజా సొంతం.

1943, జూన్ 2న తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఇళయరాజా. వ్యవసాయక ప్రాంతంలో పుట్టి పెరగటంతో పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో ఆయనకు జానపద సంగీత పరిచయం కలిగింది. తన సోదరులతో కలసి దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందం ఏర్పాటు చేసి రాజా తన సంగీత జ్ఞానానికి పదును పెట్టుకున్నారు.

కణ్ణదాసన్ అనే తమిళ కవి జవహర్ లాల్ నెహ్రూ మృతికి నివాళిగా రాసిన పాటకు మొదటగా ఇళయరాజా బాణీ కట్టారు. 1968లో మద్రాసులో అడుగెడుతూనే ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అణ్ణకిళి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించారు. ‘భద్రకాళి’ చిత్రంతో తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఆరంభంలో కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన ఎంతో కష్టపడి భారతీయ సంగీత రంగంలో తనదైన ముద్రవేసి మ్యూజిక్ లెజెండ్‌గా ఎదిగారు. నిత్య సంగీత సాధకుడుగా ఇళయరాజాకు పేరుంది. మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయన స్టైల్. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత లయరాజు ఇళయరాజా.

దక్షిణ భారత సంగీతం, పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ఆయన ప్రవేశపెట్టారు. జానపద బాణీలకు వెస్టర్న్ సొబగులద్ది పండిత పామరులచే శభాష్ అనిపించారు. సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడిగా రాజా పేరుగాంచారు. తన 4 దశాబ్దాల మ్యూజికల్ జర్నీలో వివిధ భాషలలో దాదాపు వెయ్యి సినిమాల్లోని 5,000 పాటలకు సంగీత దర్శకత్వం వహించారు.

ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నారు. 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రం 2010లో పద్మభూషణ్ తో సత్కరించింది. సినీ సంగీతానికి చేసిన కృషికిగాను ఇళయరాజా 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారం, 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.

ఈ ఏడాది తనకు పద్మవిభూషణ్ అవార్డ్ రావడంపై ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. తనకు పద్మవిభూషణ్ రావడం దక్షిణాదికే గర్వకారణమన్నారు. అవార్డ్ వచ్చిన సందర్భంగా ఇళయరాజా తెలుగులో మాట్లాడారు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజాకు ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారం రావడంపై స్టార్‌ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ హర్షం వ్యక్తంచేశారు. అగ్రనటులు ఇద్దరూ రాజాకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

arun

arun

Next Story