ఓ మట్టి మనిషి చరిత్ర సృష్టించాడు

ఓ మట్టి మనిషి చరిత్ర సృష్టించాడు
x
Highlights

నేను, నాది అంటూ స్వార్ధంతో జీవించే మనుషుల మధ్య అక్కడక్కడా తోటి వారి కోసం నిస్వార్ధంగా సేవ చేసే మనుషులు మనకు అరుదుగానైనా కనిపిస్తారు. అలాంటి...

నేను, నాది అంటూ స్వార్ధంతో జీవించే మనుషుల మధ్య అక్కడక్కడా తోటి వారి కోసం నిస్వార్ధంగా సేవ చేసే మనుషులు మనకు అరుదుగానైనా కనిపిస్తారు. అలాంటి మహానుభావుల్లో ఒకరే జలంధర్ నాయక్. అవును జలంధర్ నాయక్ ఎవరో వస్తారని ఎదురుచూడలేదు. తనే అందరికంటే ముందు అడుగు వేశాడు. ఒంటి చేత్తో కొండను తొలచి గ్రామానికి రోడ్డు వేశాడు. తన పిల్లలు పడ్డ కష్టం ఇంకెవరు పడొద్దనే ఓతండ్రి తపన గ్రామానికి రోడ్డు తీసుకొచ్చేలా చేసింది. ఒరిస్సాలోని కంథమాల్ కు చెందిన మన్యంలో మొనగాడు ఏంచేశాడో ఓసారి చూడండి.

చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది ఒరిస్సాలోని కంథమాల్ జిల్లాలోని గుమ్సాహీ గ్రామం. పట్టణానికి, మనుషులకు దూరంగా విసిరేసినట్టు ఉండే గ్రామం ఇది. కనీసం నడవడానికి వీలుగా రోడ్డు కూడా ఈ గ్రామంలో లేదు. ఇక విద్యుత్‌, మంచినీటి సరఫరా లాంటి కనీస మౌలిక సదుపాయాలకు కూడా ఈ గ్రామం చాలా దూరం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో గ్రామంలోని మిగతా వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. కానీ జలంధర్ నాయక్ ఒక్కడు మాత్రం పట్టణానికి వెళ్లలేక ఉన్న ఊళ్లో ఉండలేక దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కూరగాయలు అమ్ముకుంటూ అతికష్టం మీద జీవనం సాగించే జలంధర్‌ నాయక్‌ కుటుంబమొక్కటే మిగిలిందక్కడ!

నాయక్‌ దంపతులకు ముగ్గురు కొడుకులు. పేదరికంలోనూ పిల్లల్ని చదివించాలనే పట్టుదలవారిది. రాతిదిబ్బల గుండా పిల్లలు ప్రతిరోజూ గుమ్సాహి నుంచి ఫుల్బనీలోని పాఠశాలకు నడిచివెళ్లే క్రమంలో ఎన్నోదెబ్బలు తగిలేవి. కొన్నేళ్లకు పిల్లలు ముగ్గురికీ ఫుల్బనే ప్రభుత్వ హాస్టల్‌లో సీట్లు దొరికాయి. రోజూవారీ కష్టాలు తప్పినా, సెలవుల్లో ఇంటికి వెళ్లిరావడం నరకప్రాయంగా ఉండేది. గుమ్సాహి గ్రామానికి రోడ్డు కోసం నాయక్‌ కలవని నాయకుడంటూ లేడు. కానీ ఫలితం శూన్యం. దీంతో రెండేళ్ల కిందట.. ఒకరోజు నాయక్‌ తనకు తానే రోడ్డు నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. భార్య కట్టిన సద్దిమూటను చేతబట్టుకుని, పలుగు-పారను భుజాన వేసుకుని అడివిలోకి నడిచాడు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తొలి అడుగు తానే వేశాడు. రెండేళ్లపాటు రోజుకు 8 గంటలు కష్టపడుతూ.. అడవిలోని రాళ్లు, రప్పలను పక్కకు తొలగించాడు. పట్టణానికి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న రాళ్లదిబ్బల దారిని తన పలుగుతో ముక్కలు చేశాడు.

పిల్లల కష్టాన్ని తండ్రిని ఆలోచనలో పడేసింది. అంతే రోడ్డు తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు జలంధర్ నాయకు కూడా తెలియదు తన ఆలోచన గ్రామ స్వరూపాన్ని మార్చడమే కాదు ఊరు వదిలి వెళ్లిన వాళ్లను తిరిగి రప్పిస్తుందని. కానీ తాను తన పిల్లల కోసం, గ్రామం కోసం చేసిన ప్రయత్నం రాష్ట్రం, దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ గ్రామం అందరికి ఆదర్శప్రాయమైంది. గుమ్సాహి మారు మూల గ్రామం నుంచి ఓ మోస్తరు సదుపాయాలు ఉండే ఫుల్బనీకి మొత్తం దూరం 15 కిలోమీటర్లు. రెండేళ్లలో జలంధర్‌ ఒక్కడే 7 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు. మిగిలిన 8 కిలోమీటర్ల రోడ్డును వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలన్నది అతడి లక్ష్యం. కానీ అంతకంటే ముందే ఫలితం దక్కింది. జలంధర్ నాయక్ వేసిన ఒక్క అడుగుకి ప్రభుత్వం వెయ్యి అడుగులు వెంట నడవాల్సి వచ్చింది.

జలంధర్ ఒంటిచేత్తో రోడ్డును తవ్విన విషయం లోకల్ పేపర్ లో వార్తగా రావడంతో ఏకంగా కలెక్టర్ స్పందించారు. కంధమాల్‌ జిల్లా కలెక్టర్‌ డి. బృందా హుటాహుటిన అధికారులను పంపించి జలంధర్‌ నాయక్‌ను కలెక్టరేట్‌కు పిలిపించారు. ఆఫీసులో కాసేపు మాట్లాడి, ఆయన నిర్మించిన రోడ్డును చూసేందుకు బయలుదేరారు. పెద్ద వాహనాలు కూడా సులువుగా ప్రయాణించగలిగినంత పెద్ద రోడ్డును చూసి కలెక్టర్‌ బృందా ఆశ్చర్యపోయారు. మిగిలిన 8 కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వమే నిర్మిస్తుందని జలంధర్‌కు మాటిచ్చారు.

అంతేకాదు.. అప్పటి వరకు రోడ్డు నిర్మించినందుకు అతనికి పూర్తివేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద చెల్లించేందుకు ఏర్పాట్లుచేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యేవరకు పనులు పర్యవేక్షించే బాధ్యతను జలంధర్‌కే కట్టబెట్టారు. గుమ్సాహి గ్రామానికి రోడ్డుతోపాటు విద్యుత్‌, మంచినీటి సరఫరా పనులుకూడా ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో జరుగనున్న కంధమాల్‌ ఉత్సవాల్లో జలంధర్‌ను ఘనంగా సత్కరించనున్నారు.

కనీస మౌలిక సదుపాయాలు లేవని ఊరు వదిలి పోయినవాళ్లంతా ఒక్కొక్కరుగా మళ్లీ సొంత ఊరు బాటపట్టడం అప్పుడే మొదలైంది ‘ఇంకొన్ని రోజుల్లోనే మా బిడ్డలు సునాయాసంగా ఇంటికొచ్చివెళ్లే పరిస్థితి వస్తుంది. ఆలస్యంగానైనా మమ్మల్ని గుర్తించిన అధికారులకు ధన్యవాదాలు’’ అంటున్నాడు వ్యవస్థను మార్చిన మట్టి మనిషి జలంధర్‌ నాయక్‌. ఒక్కడే ఎంతో కష్టపడి గ్రామానికి రోడ్డు వచ్చేలా కృషి చేసిన జలంధర్ నాయక్ ను ఇప్పుడా గ్రామస్తులంతా మన్యంలో మొనగాడిగా కీర్తిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories