
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాయి. దీంతో ఇవాళ కూడా అవిశ్వాస తీర్మానం లోక్సభ ముందుకు రాబోతోంది. అయితే...
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాయి. దీంతో ఇవాళ కూడా అవిశ్వాస తీర్మానం లోక్సభ ముందుకు రాబోతోంది. అయితే ఇవాళ కూడా సభ ఆర్డర్లో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. అవిశ్వాసం ప్రక్రియ చేపట్టాలంటే సభ ఆర్డర్లో ఉండాలి. కానీ శుక్రవారం, సోమవారం రెండుసార్లు సభ ఆర్డర్లో లేకపోవడంతో స్పీకర్ ఆ నోటీసుల్ని చదివి వినిపించినా అంతకు మించి ప్రక్రియ ముందుకు సాగలేదు. పోడియంలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఆందోళనల కారణంగా తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేశారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉండడంతో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతించడం అనుమానంగానే ఉంది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఆయా రాష్ట్రాల సమస్యలపై పోడియంలో ఆందోళన చేస్తున్నాయి. రిజర్వేషన్ల కోటా పెంపు విభజన హామీల అమలు వంటి అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఇకపై కూడా ఆందోళన కొనసాగిస్తామని వారు నిన్న ప్రకటించారు. అంటే ఇవాళ కూడా టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ వెల్ లోకి వెళ్ళి ఆందోళన తెలపడం ఖాయం. అటు కావేరి నిర్వాహక మండలి ఏర్పాటు డిమాండ్తో అన్నాడీఎంకే ఎంపీలు కూడా కొద్ది రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వచ్చినా తమిళనాడు అధికార పార్టీ ఎంపీలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇవాళైనా సభ ఆర్డర్లో ఉంటుందా అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా అనేది సస్పెన్స్గా మారింది.
కానీ అవిశ్వాసంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ అంటోంది. లోక్సభలో చర్చ జరిగే పరిస్థితి లేదని తెలిసే చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ నిన్న సభలో ప్రకటన చేశారని ఆరోపించింది. లోక్సభలో జరగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతా మ్యాచ్ ఫిక్సింగ్లా కనిపిస్తోందని చెబుతోంది. ఇక మరాఠీల నూతన సంవత్సరం సందర్భంగా నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన విందును టీడీపీ , వైసీపీ బహిష్కరించాయి. ఏపీకి జరిగిన అన్యాయం, ప్రజల ఆవేదనను తెలియజేయడానికే స్పీకర్ విందును బహిష్కరించామని టీడీపీ, వైసీపీ ఎంపీలు చెప్పారు.
అయితే ఈ నెల 23న పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 23న బీజేపీ పార్లమెంటరీ పార్టీ పమావేశం కూడా ఉండడంతో అదే రోజు పార్లమెంటు సమావేశాలకు ముగింపు పలుకుతారన్న వాదన వినిపిస్తోంది. పార్లమెంటు సమావేశాల ముగింపు రోజు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత జగన్ గతంలోనే ప్రకటించారు. ఆయన ప్రకటన మేరకు ఉభయ సభలు ఎప్పుడు వాయిదా పడతాయో అదే రోజు వైసీపీ ఎంపీలు రాజనామా చెయ్యాలని యోచిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానం లోక్సభ ముందుకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడాన్ని డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ తప్పపట్టారు. కావేరి నిర్వాహక మండలి కోసం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి పంపినా పట్టించుకోని కేంద్రం మెడలు వంచాలంటే టీడీపీ , వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా కావేరి బోర్డు ఏర్పాటుకు యత్నించాలని స్టాలిన్ అన్నాడీఎంకే ఎంపీలకు సూచించారు.
మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్యపక్షం శివసేన మోడీ సర్కారుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. పాతికేళ్లపాటు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న భ్రమలను టీడీపీ అవిశ్వాస తీర్మానం పటాపంచలు చేసిందని వ్యాఖ్యానించింది. ఎన్డీఏ సర్కారుపై అపనమ్మకం ఏర్పడిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటాయని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో జోస్యం చెప్పింది. అంతేకాదు అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే భారీ మెజారిటీతో అవిశ్వాసం గెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire