
సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకాలను పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది కాళేశ్వరం, భగీరథ,...
సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకాలను పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది కాళేశ్వరం, భగీరథ, డబుల్ బెడ్రూమ్ పథకాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ దాదాపు పూర్తి కావస్తోంది. దీంతో పాటు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథను పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ఈ ఏడాదిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. సాధారణ ఎన్నికలకు ఏడాదే గడువుండటంతో ప్రతిష్టాత్మక పథకాలైన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణలోని 37 లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించే బృహత్కర ప్రాజెక్టు.. కాళేశ్వరం నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు లింక్ 1 పనుల పూర్తికి దాదాపు వంద రోజులే మిగిలి ఉన్నందున మూడు షిప్టుల్లో 45 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ జూన్ కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ నుంచి సాగునీరు అందించడమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో పనులు జరుగుతున్నాయి. ఎన్నికలలో ఉద్యమ సమయంలో చెప్పినట్టు గోదావరి నీళ్లను తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత తమదేనని చెప్పుకొనేందుకు కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యుద్దప్రాతిపాదికన పనులు చేస్తోంది.
ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్లు, పంపుసెట్లతో కూడిన మెయిన్ గ్రిడ్ పనులు 95% పూర్తయ్యాయి. గ్రామాల్లో అంతర్గత పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా ప్రాజెక్టు పనిలో 75% పూర్తయింది. ఇప్పటికే చాలా గ్రామాలకు మంచినీరు అందుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి నల్లా ద్వారా కూడా నీరందిస్తున్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలలు ముందే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది.
ఇక కేసీఆర్ మానస పుత్రిక పేరొందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణి కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సర్కార్.. అధికారులను పరుగులు పెట్టిస్తోంది. స్టీల్, సిమెంటుతో పాటు ఇతర మెటీరియల్ ధరలు పెరిగినందున ప్రభుత్వం చెల్లించే ధరలు సవరించేందుకు బోర్డు ఆఫ్ ఇంజనీర్స్ సమావేశం కావాలని అదేశించింది. ఈ ఏడాది 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సిఎం కేసీఆర్.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire