
తన మాటలతో అందర్నీ ముప్పుతిప్పలు పెట్టే రాంగోపాల్వర్మకు మహిళా సంఘాలు, సీసీఎస్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. జీఎస్టీ సినిమా, సామాజిక కార్యకర్త...
తన మాటలతో అందర్నీ ముప్పుతిప్పలు పెట్టే రాంగోపాల్వర్మకు మహిళా సంఘాలు, సీసీఎస్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. జీఎస్టీ సినిమా, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వర్మను మూడున్నర గంటలపాటు విచారించిన సీసీఎస్ టీమ్ తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పోలీసులు సంధించిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేసిన వర్మ వాటికి జవాబులిచ్చేందుకు గడువు కోరారు. అయితే ఇవాళ మరోసారి సీసీఎస్ ముందు హాజరుకానున్న వర్మ అగ్నిపరీక్ష ఎదుర్కోనున్నారు. ఇంతకీ వర్మ విచారణకు హాజరవుతాడా? లేక మరోసారి గడువు కోరతాడా? ఒకవేళ సీసీఎస్ ముందు హాజరైతే కేవలం ప్రశ్నించి వదిలేస్తారా? లేక ఈసారి అరెస్ట్ చేస్తారా?
రాంగోపాల్వర్మ మరోసారి సీసీఎస్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. వర్మను అరెస్ట్ చేయాల్సిందేనంటూ మహిళా సంఘాల ఆందోళనలు ఉధృతమవుతున్నవేళ రెండోసారి సీసీఎస్ ఎదుట అటెండ్ కానున్నారు. జీఎస్టీ సినిమా, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలపై రాంగోపాల్వర్మను సీసీఎస్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. మొదటిసారి మూడున్నర గంటలపాటు విచారించిన పోలీసులు ఈరోజు మరిన్ని కొత్త ప్రశ్నలు సంధించనున్నారు. అలాగే వర్మ సమాధానాలు చెప్పకుండా దాటవేసిన ప్రశ్నలకు కూడా ఈసారి కచ్చితంగా జవాబులు రాబట్టనున్నారు. ఈ కేసులో కొత్తగా సేకరించిన సమాచారంతోనూ వర్మను ప్రశ్నించనున్నారు.
సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మను విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు మొదటిసారి 24 ప్రశ్నలు సంధించి కొంత సమాచారం రాబట్టారు. అయితే జీఎస్టీ సినిమాపై పొంతనలేని సమాధానాలు చెప్పిన వర్మ ఆ మూవీని పోలాండ్లో చిత్రీకరించారని ఆ సినిమాకు స్కైప్ ద్వారా కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చానని చెప్పాడు. దాంతో వర్మ ల్యాప్ ట్యాప్ను స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైమ్ వింగ్ దానిని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఆ తర్వాత వర్మ పాస్పోర్టును స్వాధీనం చేసుకొని వివరాలు సేకరించారు. వర్మ ల్యాప్ ట్యాప్కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్న సీసీఎస్ పోలీసులు తమ సందేహాల నివృత్తి కోసం స్కైప్ నిర్వాహకులకు లేఖ రాశారు.
ల్యాప్ ట్యాప్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం చేతికందితే దాని ఆధారంగా వర్మను విచారించాలని సీసీఎస్ పోలీసులు భావించారు. కానీ సాంకేతిక సమస్యలతో నివేదిక ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిసారి మూడున్నర గంటలపాటు విచారించి వదిలిపెట్టిన పోలీసులు ఈసారి అరెస్ట్ చేయాలా? లేక కేవలం ప్రశ్నించి విడిచిపెట్టాలా? అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అరెస్ట్చేసి హడావిడిచేసే కంటే పలుమార్లు విచారించిన తరువాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టు అనుమతితో తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
అయితే సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదుతో వర్మపై ఐటీ యాక్ట్ 67, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో రాంగోపాల్ వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో రెండోసారి విచారణ తర్వాత పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అసలు ఈరోజు వర్మ విచారణకు హాజరవుతాడా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ కేసులో అన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉండటంతో వర్మ మరింత సమయం అవకాశమున్నట్లు సమాచారం అందుతోంది.
వర్మ రెండోసారి విచారణకు హాజరుకావడంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న వర్మ సోమవారం వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తనను రెండోసారి విచారణకు పిలవలేదని వర్మ ట్వీట్ చేశారు. శుక్రవారం విచారణకు పిలిచినట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదన్న వర్మ కొందరు తనను సైకోగా, ఉగ్రవాదిగా, విపరీత ప్రవృత్తిగలవానిగా ముద్ర వేస్తున్నారంటూ మండిపడ్డారు. మరికొందరైతే తనను కాల్చేయాలంటున్నారని కానీ తానైతే 27వ అంతస్థు టెర్రస్పై కూర్చొని ఆ మాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire